Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల క్రమబద్ధీకరణ ప్రక్రియను అడ్డుకోకుండా కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం సుప్రీం కోర్టులో కేవియట్ దాఖలు చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి రమణారెడ్డి, కొప్పిశెట్టి సురేష్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తామంటూ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన ఐఏఎస్ అధికారుల బృందంతో కమిటీ వేశారని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం 2016లో జీవోనెంబర్ 16న విడుదల చేశారని పేర్కొన్నారు. కొందరు కోర్టును ఆశ్రయించడం వల్ల ఈ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయిందని వివరించారు. 2021, డిసెంబర్ ఏడో తేదీన ఆ కేసును హైకోర్టు ఎత్తివేసిందని తెలిపారు. దీంతో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అడ్డంకులు తొలగిపోయాయని పేర్కొన్నారు.
ఆ ప్రక్రియను త్వరగా చేపట్టాలని కోరుతూ సీఎంకు, పలువురు మంత్రులు, అధికారులకు అనేక సార్లు వినతిపత్రాలు సమర్పించామని వివరించారు. రాష్ట్రంలో 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తున్నట్టు ఇటీవల అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. ఆర్థిక శాఖ కాంట్రాక్టు ఉద్యోగుల సమాచారం పంపించాలంటూ ఇతర శాఖలను ఆదేశించిందని తెలిపారు. ఈ దశలో కొంతమంది కుట్రతో ఈ ప్రక్రియను ఆపాలనే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసిందని వివరించారు. మళ్లీ అడ్డంకులు రాకుండా ఈ ప్రక్రియ సజావుగా సాగుందుకే సుప్రీం కోర్టులో కేవియట్ దాఖలు చేశామని పేర్కొన్నారు.