Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భవిష్యత్ తరాల కోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే జనగణలో కులగణన చేపట్టి, పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ మేరకు ఢిల్లీలోని గురువారం తెలంగాణ భవన్లో నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో వారి జనాభా ప్రకారం వాటా ఇవ్వాలని కోరారు. విద్యా, ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించటానికి ఉన్న అభ్యంతరాలేంటో చెప్పాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రతిపాదికన చట్టసభల్లో రిజర్వేషన్లు ఉన్నాయనీ, బీసీలకు వాటిని వర్తింపజేయకపోవటం దారుణమని తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు ఢిల్లీలోనే ఉంటూ తమ పోరాటాలను ఉధృతం చేస్తామనీ, వివిధ పార్టీల ఎంపీలను కలిసి మద్దతు కోరతామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నిరుద్యోగ జేఏసీ అధ్యక్షులు నీల వెంకటేశ్ , బీసీ న్యాయవాదుల జేఏసీ నాయకులు జక్కుల వంశీ , తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ కృష్ణ , గొల్లపెల్లి సునిల్తో పాటు పలువురు పాల్గొన్నారు.