Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్
- హైదరాబాద్ కలెక్టర్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-సిటీబ్యూరో
సొంత ఇండ్లు లేని పేద ముస్లిం మైనార్టీలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ ప్రభుత్వాన్ని డిమండ్ చేశారు. చిరు వ్యాపారులకు, నిరుద్యోగులకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించాలని, పాతబస్తీలో వసతులు మెరుగుపర్చాలని కోరారు. రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా ఆవాజ్ హైదరాబాద్ సౌత్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఆవాజ్ హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి షేక్ అబ్దుల్ సత్తార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అబ్బాస్ మాట్లాడుతూ.. మైనార్టీల సమస్యలను తెలుసుకోవడానికి ఆవాజ్ రాష్ట్రవ్యాప్తంగా సర్వేలు నిర్వహించిందన్నారు. పాతబస్తీలో ముస్లింల స్థితిగతులు చాలా అధ్వానంగా ఉన్నాయని, తరతరాలుగా అద్దె ఇండ్లల్లో ఉంటూ, పెరుగుతున్న అద్దెలు భరించలేక ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాలు జీవిస్తున్నాయని చెప్పారు. సుధీర్ కమిషన్ నివేదిక ప్రకారం పాత నగరంలో 48 శాతం కుటుంబాలకు సొంత ఇండ్లు లేవని, ప్రభుత్వం ప్రకటించిన డబుల్ బెడ్రూం ఇండ్లు వీరికి అందడం లేదని అన్నారు. అరకొరగా నిర్మించిన డబుల్ ఇండ్లలో ప్రజాప్రతినిధుల మధ్య పంపకాలు జరుగుతున్నాయని, స్థానిక ప్రజలు తమ దృష్టికి తెచ్చారని, అర్హులకు అందడం లేదని అన్నారు. కింది స్థాయిలో ప్రభుత్వం నేరుగా సర్వేలు నిర్వహించి అర్హులైన పేదలకు అందేలా చూడాలని కోరారు. ఇఫ్తార్ విందులు, రంజాన్ తోఫాల లాంటి ప్రచార ఆర్భాట కార్యక్రమాలు కాకుండా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్కు నిధులు పెంచి నిరుద్యోగ యువతకు, ఫుట్పాత్ వర్కర్స్, స్ట్రీట్ వెండర్స్,ఆటో డ్రైవర్స్, మెకానిక్స్ లాంటి వారికి రూ.10లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. పాతబస్తీలో నాలా,తాగునీటి సౌకర్యం,రోడ్లు నిర్మాణం వంటి మౌలిక వసతుల అభివృద్ధికి రూ.పది వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.సోషల్ వర్కర్ సిరాజ్ ఆమేరారాఖాన్,ముస్లిం హక్కుల సంఘ ం నాయకురాలు షమీమ్ సుల్తానా,రిజ్వానా ఖాద్రి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ హైదరాబాద్ సౌత్ జిల్లా ఉపాధ్యక్షులు నసీరుద్దీన్, బాబా తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం హైదరాబాద్ డీఆర్వో కె.సూర్యలతకు వినతిపత్రం అందజేశారు.