Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ డిమాండ్
- కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-కంఠేశ్వర్
పెట్రోల్, గ్యాస్, వంటనూనె ధరలను వెంటనే తగ్గించాలని డీవైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పెద్ది సూరి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర ధరలను అడ్డూ అదుపు లేకుండా పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఏ ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదన్నారు. ఇష్టం వచ్చినట్టు నిత్యావసర ధరల రేట్లు పెంచుకుంటూ పోతే రెక్కాడితేగానీ డొక్కాడని ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఒంటెద్దు పోకడ చర్యలను మానుకొని పెంచిన ధరలను తక్షణమే అదుపుచేసి ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పిట్ల నరేష్, ఉపాధ్యక్షులు కిరణ్చారి, సహాయ కార్యదర్శి ఆశీర్వాదం, కిరణ్, సాయినాథ్, జిల్లా కమిటీ సభ్యులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.