Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోగో ఆవిష్కరించిన రిటైర్డ్ ఐఏఎస్ బీఆర్ మీనా
- ఒకే వేదిక మీద భూసేవలు, న్యాయ సలహాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కీలకమైన, విలువైన భూములకు సంబంధించిన సేవలు సులభతరం చేయాలనే ఆలోచనకు టెక్నాలజీని జోడించి 'ల్యాండ్డాక్స్' సంస్థను ప్రారంభిస్తుండటం అభినందించదగ్గ విషయమని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీఆర్ మీనా అన్నారు. 'ల్యాండ్డాక్స్' సంస్థ లోగోను శనివారం అమీర్పేటలోని గ్రీన్పార్క్ హౌటల్లో ఆమె ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఇలాంటి సేవలు అందించే సంస్థలు ఈ రంగంలో లేవనీ, 'ల్యాండ్డాక్స్' సంస్థ ద్వారా ప్రజలకు మేలు కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భూములకు సంబంధించిన చట్టాలు చాలా క్లిష్టమైనవన్నారు. వివిధ శాఖలకు చెందిన అనేక చట్టాలు భూములకు వర్తిస్తాయని చెప్పారు. సామాన్యులకు భూసేవలను సులభతరం చేయాలనే ఆలోచనతో సంస్థను ప్రారంభించడం మంచి పరిణామమన్నారు. భూచట్టాల నిపుణులు సునీల్ కుమార్ మాట్లాడుతూ... భూరికార్డులు, భూచట్టాలు ఎవరికీ అర్థం కాని బ్రహ్మపదార్థాలుగా మారిపోయాయనీ, ఈ పరిస్థితుల్లో 'ల్యాండ్డాక్స్' సంస్థ భూములకు సంబంధించిన సేవలన్నీ ఒకే వేదికగా అందించే ఆలోచనతో ముందుకురావడం స్వాగతించదగ్గ విషయమని చెప్పారు. సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్ నిరూప్ రెడ్డి వర్చువల్ పద్ధతిలో మాట్లాడుతూ.. భూములకు సంబంధించిన అన్ని రంగాల వారు అడ్వైజర్లుగా యువ బృందం ప్రారంభిస్తున్న 'ల్యాండ్డాక్స్' సంస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ల్యాండ్ డాక్స్ సహ వ్యవస్థాపకులు మాధవ్రెడ్డి మాట్లాడుతూ.. తమ సంస్థ సేవలను రెండునెలల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. మారుమూల గ్రామం నుంచి మహానగరం వరకు ఎక్కడైనా తమ సంస్థ సేవలను అందిస్తుందనీ, ఒక్క వెబ్సైట్ క్లిక్ లేదా ఒక్క కాల్ చేయడం ద్వారా ఇంటి వద్దనే కావాల్సిన సేవలు అందించడం తమ సంస్థ ఉద్దేశ్యమని తెలిపారు. భూములకు సంబంధించిన సమాచారాన్ని అందించడం, సర్వే చేయించడం, లీగల్ ఓపీనియన్ ఇవ్వడం వంటి సేవలను అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్రెడారు జాతీయ ఉపాధ్యక్షులు రామ్రెడ్డి, క్రెడారు కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, న్యాయ నిపుణులు, విశ్రాంత రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
ల్యాండ్ డాక్స్ చీఫ్ అడ్వైజర్గా బీఆర్ మీనా
'ల్యాండ్డాక్స్' సంస్థకు చీఫ్ అడ్వైజర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీఆర్ మీనా, అడ్వెజర్గా సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది నిరూప్రెడ్డి ఉంటారు. అడ్వైజరీ బోర్డుకు భూచట్టాల నిపుణులు సునిల్ కుమార్ ఛైర్మన్గా వ్యవహరించనున్నారు. ఆ బోర్డులో రిటైర్డ్ డీఆర్వో రాజారావు, డిప్యూటీ కలెక్టర్ లచ్చిరెడ్డి, ఇస్రో సైంటిస్ట్ రాఘవేంద్ర, సందీప్ రెడ్డి, ఓఎన్జీసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ కుమారస్వామి, లీడ్ ఇండియా సంస్థ కోశాధికారి రవీందర్, బొగ్గారపు శరత్, పలువురు న్యాయనిపుణులు, సర్వే నిపుణులు, రిటైర్డ్ రెవెన్యూ అధికారులు సలహాదారులుగా ఉండనున్నారు.