Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదుపులేని ధరలు.. అరికట్టలేని మోడీ సర్కారు
- రాష్ట్రంలో పెంచిన విద్యుత్, బస్చార్జీలు తగ్గించాలి
- ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదే
- కేంద్రంపై పోరులో ప్రతిపక్షాలను కలుపుకుపోవాలి
- ధరల వ్యతిరేక ర్యాలీలో తమ్మినేని
నవతెలంగాణ ప్రతినిధి- హైదరాబాదు
రోజు రోజుకూ పెరుగుతున్న చమురు ధరలతోపాటు నిత్యావసర వస్తువుల ధరలను మోడి సర్కారు అరికట్టలేక పోతున్నదని సీపీఐ( ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. పెంచిన పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించకపోతే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. పెరిగిన ధరలకు నిరసనగా సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఆదివారం హైదరాబాద్లోని మాకినేని బసవపున్నయ్య భవన్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ''పెరిగే ధరలకు హద్దే లేదు.. ఏలేటోనికి బుద్దేలేదు.. ఏం కొనేటట్టుందీ..ఏం తినేటట్టుంది? అదుపు లేని ధరలు.. అరికట్టలేని ప్రభుత్వం... పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలి. సామాన్యులపై భారాలు మోపుతున్న మోడీ సర్కార్ డౌన్..డౌన్. విద్యుత్, ఆర్టీసీ బస్ చార్జీలు తగ్గించాలి'' తదితర నినాదాలతో ఆర్టీసీ క్రాస్రోడ్ హోరెత్తింది. పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు ప్రజల బతుకులపై ఈటల్లా వదులుతున్న మోడీ వేషధారణ సబికులను ఆకట్టుకుంది. పెరిగిన డీజిల్ ధరలతో సామాన్య ఆటోవాలా పడుతున్న బాధలను వ్యక్తం చేస్తున్న తీరుకు ప్రతిరూపంగా ఆటోకు తాళ్లుకట్టి సీపీఐ(ఎం) నాయకులు లాక్కొచ్చారు. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో తమ్మినేని మాట్లాడుతూ అంతర్జాతీయంగా పెరిగిన ధరలకు అనుగుణంగా డిజిల్, పెట్రోలు ధరలు పెరుగుతున్నాయని చెప్పటం తప్పన్నారు. చమురు ధరలు పెంచటమనేది ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారిందని విమర్శించారు. ధరలు పెరుగుతున్న ప్రతి సందర్భంలో 45 శాతం పన్నులు వేయటమేంటో చెప్పాలని ప్రశ్నించారు. పదే పదే ధరలు ఎందుకు పెంచుతున్నారు? దీనికి గల కారణాలేంటి? ఆ మేరకు పన్నుల భారాన్ని ఎందుకు మోపుతున్నారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలకు లేదా? అని నిలదీశారు. ధరలను అదుపుచేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి ఏందో తెలియాలంటే.. శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలలో ఎవరి వాటా ఎంతో తేలిపోతుందన్నారు.
ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదే...
ధాన్యం కొనుగోలు బాధ్యత పూర్తిగా కేంద్రప్రభుత్వానిదేనని తమ్మినేని చెప్పారు. కేంద్రం మాయ మాటలు చెప్పి తెలంగాణను అవమానిస్తున్నదని తెలిపారు. గతంలో ఏ విధంగానైతే ధాన్యం కొన్నారో..అదే విధంగా ఎందుకు కొనటం లేదో చెప్పాలన్నారు. ధాన్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ధాన్యం కోనుగోలు కోసం కేంద్రంపై జరిగే పోరాటం టీఆర్ఎస్, బీజేపీ పార్టీల యుద్ధంలా మార్చుతున్నాయని విమర్శించారు. ఇరు పార్టీల విమర్శల వరకు పరిమితం చేయటం సరికాదన్నారు. ధాన్యం కొనుగోలు సమస్య పరిష్కారం కావాలన్న చిత్తశుద్ధి నిజంగా ఉంటే వామపక్ష, ప్రతిపక్ష పార్టీలను భాగస్వామ్యం చేయాల్సిన బాధ్యత కేసీఆర్ పై ఉందన్నారు. అలాంటి ప్రయత్నం ఇప్పటికైనా చేస్తే మంచిదని సూచించారు.
విద్యుత్, బస్సు ఛార్జీలు తగ్గించాలి
మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా పెరిగిన చమురు ధరలు, నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్యుడు సతమతమవుతుంటే...మేమేం తక్కువ కాదన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా విద్యుత్, ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచారని తమ్మినేని ఆందోళన వ్యక్తం చేశారు. నాడు చంద్రబాబు నాయుడు కరెంటు చార్జీలు పెంచితే పెద్ద ఎత్తున ఉద్యమం చేశామని చెప్పారు. ముగ్గురు కార్యకర్తలు కూడా చనిపోయారని గుర్తుచేశారు. ఆ ఉద్యమం ఫలితంగానే 20 ఏండ్లు కరెంటు చార్జీలు పెరచేందుకు ఏ ప్రభుత్వాలు ధైర్యం చేయలేదని చెప్పారు. కానీ..టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ చార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారాలను వేసిందన్నారు. తక్షణం పెంచిన విద్యుత్, ఆర్టీసీ బస్సు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఐక్యంగా ఉద్యమించక తప్పదని హెచ్చరించారు.
వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఉపాధి దెబ్బతిని, ఉద్యోగాలు కోల్పోయి, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై ధరల భారాలు మోపటం ప్రభుత్వాలకు సమంజసమేనా? అని ప్రశ్నించారు. ధరల పెరుగుదలకు ఉక్రెయిన్ యుద్ధం కారణమని చెప్పటం సరికాదన్నారు. యుద్ధానికి ముందు కూడా ధరలు పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. వారం పదిరోజులుగా పెరిగిన ధరల వల్ల ఒక్కో కుటుంబంపై రూ.1500నుంచి రూ.2000వరకు అదనపు భారం పడుతున్నదని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయ కార్మికుల కుటుంబాల జీవనం ఎలా సాగిస్తామని ప్రశ్నించారు. నగదు బదిలీతో ప్రజలను మోసం చేయబోతున్నారని ఆనాడే సీపీఐ(ఎం) చెప్పిందనీ, వంటగ్యాస్ సబ్సిడీ ఎలా పడిపోతున్నదో చూస్తే..నగదు బదిలీ రహస్యం అర్థమవుతున్నదని వివరించారు. శ్రీలంకలో ఇదే పరిస్థితిని అనుసరించటం వల్లనే అక్కడ సంక్షోభం ఏర్పడిందని చెప్పారు. ఆ సంక్షోభం నుంచి భారత ప్రభుత్వం పాఠాలు తీసుకునే పరిస్థితి కనిపించటం లేదని తెలిపారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్ అరుణ జ్యోతి మాట్లాడుతూ పెరిగిన ధరల ప్రభావం ఎక్కువగా మహిళలమీదనే ఉంటుందన్నారు. వెంటనే పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ అబ్బాస్తోపాటు రాష్ట్ర నాయకులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.