Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఈనెల 12వ తేదీన పర్యావరణ విద్య పరీక్ష జరగనుంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు కావాలంటే పర్యావరణ విద్య పరీక్షలో విద్యార్థులు తప్పనిసరిగా పాస్ కావాలన్న నిబంధన 2006-07 విద్యాసంవత్సరం నుంచి ఉందని తెలిపారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఈ పరీక్షను కొనసాగించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకే పాస్ సర్టిఫికెట్ ఇస్తామని స్పష్టం చేశారు. ఉత్తీర్ణులు కానివారికి పాస్ సర్టిఫికెట్ ఇవ్వబోమని తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులందరికీ ఈనెల 12న ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పర్యావరణ విద్య పరీక్షను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈనెల 11న ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నైతికత, మానవ విలువలు పరీక్ష ఉంటుందని తెలిపారు. మే ఆరు నుంచి 24వ తేదీ వరకు ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.