Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకోవద్దు
యాసంగి సీజన్లో తెలంగాణ రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధర రూ.1,960 చెల్లించి కొనుగోలు చేస్తుంది. రైతులెవరూ తక్కువ ధరకు వడ్లు అమ్ముకోవద్దు. మూడు, నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తాం. గతంలో మాదిరే నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు వేస్తాం. బాధ్యత కలిగిన కేంద్ర ప్రభుత్వం మెలికలు పెట్టి ముఖం చాటేసినా రైతులు చిన్నబుచ్చుకోవద్దనే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం.
- ముఖ్యమంత్రి కేసీఆర్
- కనీస మద్దతు ధర రూ.1,960 ఇస్తాం
- నాలుగురోజుల్లో ప్రక్రియ ప్రారంభం
- ఆరు ప్రయివేటు యూనివర్సిటీలకు అనుమతులు
- ప్రభుత్వ వర్సిటీల్లో విద్యాశాఖ ద్వారానే పోస్టుల భర్తీ
- కేంద్రానిది అహంకారం- అణచివేస్తాం
- మతగజ్జి లేపి..ఓట్లు దండుకోవడమే బీజేపీ పని
- త్వరలో దాని పాపాల పుట్ట బయటపెడతాం : సీఎం కేసీఆర్
నవతెలంగాణ - హైదరాబాద్ బ్యూరో
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో క్యాబినెట్ సమావేశం మంగళవారం జరిగింది. ఆ నిర్ణయాలను ఆయనే స్వయంగా మీడియాకు వెల్లడించారు. బీజేపీపై అదే స్థాయిలో తిట్ల వర్షం కురిపించి, త్వరలో దాని పాపాల పుట్టను ప్రజలముందు బద్దలు కొడతామని హెచ్చరించారు. దేశ ప్రజల దురదృష్టం కొద్దీ కేంద్రంలో చేతగాని, చేవలేని, అసమర్థ, అవినీతి, తెలివితక్కువ, అవివేక, మతోన్మాద ప్రభుత్వం ఉన్నదని తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర మంత్రివర్గం యాసంగి ధాన్యం కొనుగోలు, ఆర్ధిక భారం, మార్కెటింగ్, తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి, మూడు, నాలుగువేల కోట్లు నష్టం వచ్చినా ప్రభుత్వమే భరించి, ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించిందన్నారు. తక్కువ నష్టంతో యాసంగి ధాన్యం మార్కెటింగ్ చేసేలా సీఎస్ ఆధ్వర్యంలో నలుగురు సీనియర్ ఐఏఎస్లతో కమిటీని ఏర్పాటుచేశామన్నారు. ధాన్యం కొనుగోలులో కేంద్రం పిచ్చిగా వ్యవహరించిందనీ, కేంద్రమంత్రి పీయూష్గోయల్ అధికార గర్వం, అహంకారంతో రైతులను అవమానించేలా మాట్లాడారని అన్నారు. ఫుడ్ సెక్యూరిటీచట్టం బాధ్యతను విస్మరించి, బాయిల్డ్ రైస్ ఎగుమతులు చేయలేదని కేంద్రం స్వయంగా పార్లమెంటులోనే అబద్దాలు చెప్పిందని విమర్శించారు. యాసంగి ధాన్యంలో నూకల శాతం ఎక్కువ ఉంటుందనీ, ఆ నష్టం భరించలేకే కేంద్రం మెలికలు పెడుతోందని అన్నారు. కార్పొరేట్లు, దోపిడిదొంగలకు దాదాపు రూ.10.50 లక్షల కోట్లు మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం వద్ద రైతులకు చెల్లించేందుకు రూ.3 వేల కోట్లు లేవని ఎద్దేవా చేశారు. ఒక్క అదానీ గ్రూప్కే రూ.12వేల కోట్లు మాఫీ చేశారని ఉదహరించారు. 13 నెలలు రైతులు ఢిల్లీలో ఉద్యమిస్తే వారిని అనుమానించి, అవమానించిన దిక్కుమాలిన, దరిద్రపుగొట్టు, సంపూర్ణ రైతు వ్యతిరేక ప్రభుత్వం కేంద్రంలో ఉండటం ఈ దేశ రైతుల దురదృష్టమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించే కుట్రలో భాగంగానే ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయట్లేదన్నారు. ఎరువుల ధరలు పెంపు, బోరుబావులకు కరెంటు మీటర్లు పెట్టడం వంటివి ఈ అంతర్గత కుట్రలో భాగమేనన్నారు. బ్యాంకులను ముంచి విదేశాల్లో ఉన్న దొంగలను అరెస్ట్ చేయడానికి వెళ్లిన సీబీఐ అధికారులను వెనక్కి పిలిపించారనీ, ఆ ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. ''బలమైన కేంద్రం- బలహీన రాష్ట్రాలు'' అనే ఆర్ఎస్ఎస్ దిక్కుమాలిన సిద్దాంతాన్నే బీజేపీ అమలుచేస్తూ, సమాఖ్య వ్యవస్థను నాశనంచేస్తున్నదని విమర్శించారు.
ఆరు ప్రయివేటు యూనివర్సిటీలకు గ్రీన్సిగల్
రాష్ట్రంలో ఆరు ప్రయివేటు యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆయా శాఖలు దానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేస్తాయన్నారు. కావేరి అగ్రికల్చర్ యూనివర్సిటీ, అమిటీ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండిస్టీ (సీఐఐ), గురునానక్, నిక్మర్, ఎమ్ఎన్ఆర్ యూనివర్సిటీలకు అనుమతులు ఇచ్చామన్నారు. సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ, ఫార్మా యూనివర్సిటీలను తక్షణం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీల్లోని ఖాళీ ఉద్యోగాలను విద్యాశాఖ కామన్ బోర్డు లేదా పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా భర్తీ చేస్తామని తెలిపారు. పూర్వ రంగారెడ్డి జిల్లా, ప్రస్తుత వికారాబాద్ జిల్లాలో 111 జీవోను ఎత్తివేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వివరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో పలు శాఖల ఉన్నతాధికారులతో కూడిన కమిటీ దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్కు రూపకల్పన చేస్తుందని తెలిపారు.
పల్లె పట్టణ ప్రగతి
మే 20 నుంచి జూన్ 5వ తేదీ వరకు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఎన్టీపీసీ నిర్మిస్తున్న 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నుంచి 4వేల మెగావాట్ల విద్యుత్ 2023 నాటికి అందుబాటులోకి వస్తాయని తెలిపారు.