Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడమే మోడీ సర్కారు లక్ష్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. దేశ పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, హక్కులు, సమానత్వం అందిస్తున్న రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే దిశగా పనిచేస్తున్నదని అన్నారు. గురువారం అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ట్యాంక్బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి చాడ వెంకట్రెడ్డి సహా ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్పాషా, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈటి నరసింహ, రాష్ట్ర సమితి సభ్యులు ప్రేమ్పావని, ఎస్ ఛాయాదేవి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదంతోపాటు న్యాయవ్యవస్థ, విద్యావ్యవస్థ, మీడియాతోపాటు అన్ని ప్రజాస్వామ్య సంస్థలనూ కేంద్రంలోని రాజ్యాంగ వ్యతిరేక శక్తులు క్రమపద్ధతిలో నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. అంబేద్కర్ ఈ దేశానికి అందించిన రాజ్యాంగ పునాదులను దెబ్బతిస్తూ మనుస్మృతిని భర్తీ చేయడానికి ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగా ప్రజాస్వామ్యం, లౌకికవాదం మీద దాడి చేస్తున్నాయనీ, వాటిని అంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతతత్వ, తిరోగమన విధానాల వల్ల రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ దళిత, బహుజనులకు కల్పించిన ఆర్థిక, సామాజిక హక్కులకు రక్షణ లేకుండా పోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దళితులను పేదరికంలోకి, వివక్షలోకి నెట్టే ప్రమాదం ఉందన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనీ, అందుకోసం ఉద్యమాలను తీవ్రతరం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు కె కాంతయ్య, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలీ ఉల్లా ఖాద్రి, హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ శ్రీకాంత్, ఏఐఎస్ఎఫ్ జాతీయ నాయకులు బి స్టాలిన్, నగర ప్రధాన కార్యదర్శి గ్యార నరేష్, దళిత హక్కుల పోరాట సమితి హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జె కుమార్, సీపీఐ నగర నాయకులు పి నళిని, జ్యోతి, శ్రీమాన్, ఒమర్ఖాన్, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.