Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జలవివాదాలపై దృష్టి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం దిశగా మరోసారి అపెక్స్ కౌన్సిల్ భేటి కానుంది. ఈ నెలాఖరులోగా కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ నిర్వహించే ఈ సమావేశంలోనైనా కృష్ణా జలాల పున:పంపిణీ, ఇతర సమస్యల పరిష్కారానికి దృష్టిసారించే అవకాశాలు లేకపోలేదు. అపెక్స్ కౌన్సిల్ భేటిలో ప్రత్యేకించి కృష్ణా నదీ జలాల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై మరోసారి చర్చ జరగనుంది. కృష్ణా, గోదావరి నదీ జలాల అంశంలో రెండు రాష్ట్రాల మధ్య అనేక అభ్యంతరాలు, అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. 2020, అక్టోబరు ఆరున అపెక్స్ కౌన్సిల్ భేటి జరిగిన విషయం విదితమే. ఈ భేటిలో తెలంగాణ, ఏపీ ముఖ్మంత్రులు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో సమావేశమయ్యారు. ఇప్పటివరకు రెండు అపెక్స్ కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. ఈ నెలాఖరున మూడో కౌన్సిల్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గోదావరి నదీపైన ఎలాంటి అంతరాష్ట్ర ప్రాజెక్టులు లేనికారణంగా జీఆర్ఎంబీ బోర్డు అవసరం లేదని తెలంగాణ చెబుతుండగా, దాదాపు నిర్మాణం పూర్తయిన కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమమని ఏపీ సర్కారు అంటున్నది. కృష్ణానదీ పరిధిలోని పోతిరెడ్డిపాడు, హంద్రినీవా, తెలుగు గంగ ప్రాజెక్టుల ద్వారా బేసిన్ అవతలకు ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలిస్తున్నదని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెబుతున్నది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాలను పున:పంపిణీ చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అదిప్పుడు మరింత తీవ్రమైంది. కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యూనల్(కేడబ్ల్యూడీటీ-2) ప్రకారం నదీ జలాల పున:పంపిణీ జరిగి తీరాల్సిందేనని స్పష్టం చేస్తున్నది. కృష్ణానదిలో నీటి లభ్యత ఆధారంగా 75 శాతం ప్రాతిపదికన తెలంగాణకు 574 టీఎంసీలు ఇవాల్సి ఉందని ఇప్పటికే కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఈ మేరకు నీటి కేటాయింపులు పున:పంపిణీ చేయాలని కోరినా కేఆర్ఎంబీ స్పందించడం లేదనీ, గతంలో మాదిరిగానే 299 టీఎంసీలనే కేటాయిస్తున్నదని ఫిర్యాదు చేసింది. అదే సమయంలో అంతరాష్ట్ర జల వివాదాల చట్టం-1956లోని సెక్షన్ 3 ప్రకారం ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాల పరిష్కారానికి, ప్రధానంగా కృష్ణా నదీ నీటి పంపిణీకి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో రాష్ట్ర ప్రభుత్వం కోరుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులో ఢిల్లీలో జరిగే అపెక్స్ కౌన్సిల్ భేటికి ప్రాధాన్యత సంతరించుకుంది. కృష్ణా జలాల వివాదాల అంశాలతోపాటు గోదావరి నదీపై నిర్మిస్తున్న ఆరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు అనుమతులను త్వరగా మంజూరు చేసేలా ఆయా శాఖలను ఆదేశించాలని అపెక్స్ కౌన్సిల్ ఎదుట తెలంగాణ ప్రభుత్వం వాదన వినిపిస్తుందని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కౌన్సిల్ భేటిలో చర్చించాల్సిన అంశాలు ఇంకా ఖరారు కాలేదు. అపెక్స్ కౌన్సిల్ భేటికి ముందే జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ బోర్డుల సమావేశాలు నిర్విహించనున్నట్టు సమాచారం.