Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గత మూడు, నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలో పలు జిల్లాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకుల వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనల పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కామారెడ్డి, రామాయంపేట, ఖమ్మం తదితర ప్రాంతాల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకుల వేధింపులు, అక్రమ కేసులు పెట్టడం వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆత్మహత్య చేసుకునే ముందు వీడియో, ఆడియో రికార్డు చేసి, సూసైడ్ నోట్లో బాధితులు వారి బాధలు, కష్టాలను తెలియజేస్తున్నారని వివరించారు. ఆత్మహత్యలకు బాధ్యులైన టీఆర్ఎస్ నాయకులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలకు భరోసా కల్పించాలని కోరారు. ఈ ఘటనలు రాయలసీమ సంస్కృతికి అద్దం పడుతున్నాయని తెలిపారు. ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిష్పక్షపాతంగా వ్యవహరించి దోషులను శిక్షించాలని కోరారు.