Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ప్రభుత్వోద్యోగాల భర్తీకి నిర్వహించనున్న పోటీ పరీక్షలకు యువతను సంసిద్ధం చేసేందుకు వీలుగా మైనార్టీ స్టడీ సెంటర్లలో ఉచితంగా కోచింగ్కు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. ఈ విషయమై ఆయన తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 81వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉండగా, వీటిలో మైనార్టీ సంక్షేమ శాఖలో 76, మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీలో 1,445 ఖాళీలు ఉన్నట్టు అధికారులు మంత్రికి వివరించారు. మైనార్టీ సంక్షేమ శాఖలో గ్రూపు -1కేటగిరిలో జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి 6, గ్రూపు -2కేటగిరిలో 10 సహాయ సంక్షేమాధికారి, హౌస్ సంక్షేమాధికారి 15, జూనియర్ అసిస్టెంట్లు 28, అక్కౌంటెంట్లు 4, ఉర్థూ ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు.
మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీలో 1,445 పోస్టులు ఖాళీలు ఉండగా, వీటిలో 594టీజీటీ, 414జూనియర్ లెక్చరర్లు, 200లైబ్రేరియన్లు, 127స్టాఫ్ నర్సులు, 60ఫిజికల్ డైరెక్టర్లు, 38క్రాఫ్ట్ టీచర్లు, 12 పీఈటీ ఖాళీలు ఉన్నట్టు మంత్రికి అధికారులు తెలిపారు. గురుకులాల ఉద్యోగాలను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల మండలి (టీఆర్ఈఐబీ) ద్వారా భర్తీ చేయనున్నట్టు వివరించారు. ఈ ఉద్యోగ ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు జారీ కానున్న నేపథ్యంలో యువతకు ఆయా విషయాల్లో నిపుణులతో ఉచితంగా అత్యుత్తమ కోచింగ్ ఇప్పించేందుకు విధి విధానాలు రూపొందించి, తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు మంత్రి సూచనలు చేశారు. గ్రూపు1,2,3 పోస్టుల కోసం ఉమ్మడి 10 జిల్లాలలోని మైనార్టీ స్టడీ సెంటర్లలో, గ్రూపు-4 పోస్టులకు గాను 33జిల్లా కేంద్రాలలో కోచింగ్ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. రంజాన్ మాసం, పర్వదినం తర్వాత కోచింగ్ ఇప్పించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను మంత్రి కోరారు.