Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భానుడు భగభగ మండిపోతూ తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతూ పోతున్నాయి. నిజామాబాద్ జిల్లా లక్ష్మాపూర్లో అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఈ ఏడాది ఇదే అత్యధికం. దాదాపు అన్ని జిల్లాల్లోనూ దాదాపు 44 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుతున్నాయి. హైదరాబాద్లోనూ 41 డిగ్రీల ఎండకాసింది. దీనికితోడు గాలిలో తేమ శాతం తగ్గడంతో ఉక్కపోత తీవ్రతరమైంది. మధ్యాహ్నం పూట ఫ్యాన్లు తిరుగుతున్నా ఇంట్లో ఎండవేడిమికి సామాన్యులు తట్టుకోలేని పరిస్థితి నెలకొంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశము ంది. ఈ నేపథ్యంలో వీలైనంత మేరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు అత్యవసరం అయితేగానీ బయటకు వెళ్లవద్దనీ, పిల్లలు, వృద్ధుల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తగు జాగ్రత్తలు తీసుకుని, వాటర్ బాటిళ్లు తీసుకుని బయటకు వెళ్లాలని చెబుతున్నారు.
పలుచోట్ల తేలికపాటి వర్షం
తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు సముద్రమట్టం 0.9కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి నెలకొందనీ, రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. అదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షం పడొచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో మంగళవారం తేలికపాటి వర్షం కురిసింది. మహబూబ్నగర్, వికారాబాద్ జిల్లాల్లో ఒకటెండ్రు చోట్ల వడగండ్ల వాన పడింది. మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్లో అత్యధిక ంగా 1.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని మెహిదీపట్నంలో చిరుజల్లులు పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 12 ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసినట్టు టీఎస్డీపీఎస్ నివేదికలో పేర్కొంది.