Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి నిర్మాణంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి :సీఎం కేసీఆర్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కొత్త సచివాలయం నిర్మాణంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల పనులు సమాంతరంగా జరిపిస్తూ, త్వరితగతిన సెక్రెటేరియట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని వారికి సూచించారు. మంగళవారం సీఎం కేసీఆర్ నూతన సెక్రెటేరియట్ నిర్మాణ ప్రదేశానికి వెళ్లి, అక్కడ పనులు జరుగుతున్న తీరును కూలంకశంగా, సూక్ష్మంగా పరిశీలించారు. తొలుత బిల్డింగ్ ఫ్లోర్ల నిర్మాణ సరళిని పరిశీలించిన సీఎం, పలు అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పిల్లర్లు, కాంక్రీట్ గోడలు, స్టెయిర్ కేస్, తలుపులు, కిటికీల డిజైన్లను, వాటి నాణ్యతను సీఎం పరిశీలించారు. మంత్రుల ఛాంబర్లు, కాన్ఫరెన్స్ హాళ్లు, ఉద్యోగులు, సిబ్బంది కార్యాలయాలను కలియదిరిగి చూశారు. పిల్లర్ల డిజైన్లకు మార్పులు సూచించారు. కాంపౌండ్ గ్రిల్ మోడళ్లను పరిశీలించి అందంగా ఉండేలా చూడాలని చెప్పారు. సచివాలయం నిర్మాణపనులు జరుగుతున్న తీరుపై మంత్రిని, అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వెంట, ఆర్ అండ్ బీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్, ఎమ్మెల్యే జోగు రామన్న, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, అటవీ అభివద్ధి సంస్థ చైర్మెన్ వంటేరు ప్రతాప్రెడ్డి, సీఎంవో అధికారులు స్మితా సభర్వాల్, శేషాద్రి, రాహుల్ బొజ్జా, ప్రియాంక వర్గీస్, ఆర్ అండ్ బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి, ప్రభుత్వ నిర్మాణాల సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, నిర్మాణ సంస్థ షాపూర్ జీ పల్లోంజీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.