Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిపక్ష సీఎంల సమావేశానికి హాజరు కావాలి
- కేసీఆర్, జగన్కు రాఘవులు సూచన
- బీజేపీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి
- మత వైషమ్యాలు రెచ్చగొట్టడం దేశానికే ప్రమాదం
- ఇప్పటికీ నోరువిప్పని ప్రధాని మోడీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వీలుగా సమైక్య ఉద్యమంలో అందరూ కలిసి రావాలని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బివి రాఘవులు విజ్ఞప్తి చేశారు. ఫెడరలిజాన్ని రక్షించుకునేందుకు పూనుకోవాలని సూచించారు. ప్రతిపక్ష పార్టీల సీఎంల సమావేశానికి హాజరు కావాలంటూ కేసీఆర్, వైఎస్ జగన్ను కోరారు. రెండురోజులపాటు కొనసాగే సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సమావేశాలు ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన బుధవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో రాఘవులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నదని చెప్పారు. దీన్ని అధిగమించేందుకు, తర్వాత రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో గెలిచేందుకు మత వైషమ్యాలను పెంచేందుకు కుట్ర చేస్తున్నదని విమర్శించారు. ఇది ఆందోళనకరమని అన్నారు. ఇటీవల పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, చత్తీస్ఘడ్, బీహార్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందన్నారు. అంతకుముందు వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు గెలిచిందని చెప్పారు. సాధారణ పరిస్థితులుంటే అధికారం పోవడం తప్ప మరొకటి లేదని బీజేపీకి అర్థమైందన్నారు. అందుకే కర్నాటకలో హిజాబ్, హలాల్ వివాదాలను పెంచిపోషిస్తున్నదని వివరించారు. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో మతాల మధ్య ఘర్షణలు సృష్టిస్తున్నదని విమర్శించారు. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి వంటి వాటిని మత్య వైషమ్యాలు పెంచేందుకు వాడుకుంటున్నదని చెప్పారు. ఇది ప్రమాదకర సంకేతమని అన్నారు. వాటిపై స్పందించి మతసామరస్యాన్ని కాపాడాలంటూ కోరినా ఇప్పటివరకూ ప్రధాని నరేంద్రమోడీ నోరువిప్పలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం అనుసరిస్తున్న విధానాలు, మతవైషమ్యాలను సమైక్యంగా ఎదుర్కోవాలనీ, ప్రజలంతా ఐక్యంగా ఉండాలని కోరారు. రాబోయే కాలంలో విశాల ప్రాతిపదికన శక్తులను కూడగట్టి కేంద్రం విధానాలను ఎదిరించడానికి పూనుకుంటామని చెప్పారు.
రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్న కేంద్రం
కేంద్రం రాష్ట్రాల హక్కులను కాలరాయడమే కాకుండా ప్రజా వ్యతిరేక నిర్ణయాలను అమలు చేయాలని చూస్తున్నదని రాఘవులు విమర్శించారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను సంస్కరించాలనే పేరుతో రాష్ట్రాలపై వాటిని రుద్దుతున్నదని అన్నారు. అందులో చేరాలంటే విద్యుత్ చార్జీలు పెంచాలనీ, వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలనీ, డిస్కామ్లను ప్రయివేటీకరించాలన్న షరతులు విధించిందని గుర్తు చేశారు. జనరేటింగ్ స్టేషన్లను ప్రయివేటీకరించాలంటూ రాష్ట్రాలపై ఒత్తిడి పెంచిందన్నారు. ఏపీ ప్రభుత్వం వాటిని అమలు చేస్తున్నదని చెప్పారు. ఇవి చేయకపోతే అప్పు తీసుకునేందుకు అనుమతి ఇవ్వబోమంటూ కేంద్రం బెదిరిస్తున్నదని విమర్శించారు. డిస్కామ్లకు గ్రాంట్లు కావాలన్నా అవన్నీ చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నదని వివరించారు.
కేంద్రం ఒత్తిడికి లొంగొద్దు
ప్రజాపంపిణీ వ్యవస్థలో బియ్యం పంపిణీకి బదులుగా నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలని కేంద్రం రాష్ట్రాలను కోరుతున్నదని రాఘవులు చెప్పారు. కిలో బియ్యానికి రూ.12 నగదు ఇస్తామంటున్నదని వివరించారు. ఇదే అమలైతే రేషన్ వ్యవస్థ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రేషన్ దుకాణాలుండబోవనీ, ధాన్యం సేకరణ అక్కర్లేదనీ, అప్పుడు ఎఫ్సీఐ అవసరం లేదనీ, తద్వారా గోదాముల అవసరమే ఉండబోదని చెప్పారు. అప్పుడు రెండు కోట్ల మెట్రిక్ టన్నుల గోదాములన్నింటినీ అంబానీ, అదానీలకు ఇవ్వొచ్చని అన్నారు. ఇది దేశానికి ప్రమాదకరమన్నారు. అయితే కేంద్రం ఒత్తిడికి లొంగి ఏపీ ప్రభుత్వం దీన్ని అమలు చేసేందుకు పూనుకుందన్నారు. ఈ ఒత్తిడికి తెలంగాణ ప్రభుత్వం లొంగొద్దని కోరారు. ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను పెంచి ప్రజలపై భారాలు మోపిందని విమర్శించారు. పెట్రోల్ ఉత్పత్తులపై కేంద్రం సుంకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కానీ అది పెంచి రాష్ట్రాల మీద భారం మోపుతున్నదనీ, దీన్ని ప్రతిఘటించాలని కోరారు. కేంద్రం అనేక రూపాల్లో రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నదని చెప్పారు. ఫెడరలిజాన్ని రక్షించుకోవడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ పూనుకుంటు న్నాయని అన్నారు. ప్రతిపక్ష సీఎంల సమావేశం జరగబోతుందన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ను అందర్నీ ఆహ్వానించాలంటూ కోరామని గుర్తు చేశారు. ఉద్ధవ్ఠాక్రే ప్రతిపక్ష పార్టీల సీఎంలను ఆహ్వానిస్తున్నారనీ, ఎవరు పిలిచినా అందరూ వెళ్లాలనీ, ఫెడరలిజాన్ని రక్షించుకోవాలని కోరారు. బీజేపీ భజనను జగన్ వదులుకోవాలని సూచించారు. కేసీఆర్, జగన్ ప్రతిపక్ష సీఎంల సమావేశానికి హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.
మేలో సమస్యలపై ప్రత్యక్ష కార్యాచరణ
వచ్చేనెలలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకుంటామని తమ్మినేని ఈ సందర్భంగా చెప్పారు. వామపక్షాలు, కలిసొచ్చే ఇతర ప్రజాసంఘాలను కలుపుకుని సమరశీల ఉద్యమాలకు సన్నద్ధమవుతామనీ, ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. తాము బీజేపీని ప్రధాన శత్రువుగా భావిస్తున్నామన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్తో ఎన్నికల పొత్తు ఉండే అవకాశం లేదన్నారు. నూతన ఆర్థిక విధానాలను అమలు చేసిందే కాంగ్రెస్ అని చెప్పారు. టీఆర్ఎస్ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతూ ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశంలేదన్నారు. ఎన్నికలప్పుడే పొత్తుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులతో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను నిర్మిస్తామని చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో జరగుతున్నది కేంద్రం, రాష్ట్రం మధ్య కొట్లాటలా కాకుండా టీఆర్ఎస్, బీజేపీ మధ్య కొట్లాటలా ఉందన్నారు. అసైన్డ్ భూముల పట్టాలను రద్దు చేసి తిరిగి స్వాధీనం చేసుకోవడం సరైంది కాదన్నారు. షెడ్యూల్ పరిశ్రమల్లో ఐదేండ్లకోసారి వేతనాలు సవరించాలనీ, ఎనిమిది నుంచి 12 ఏండ్లయినా అది జరగలేదని చెప్పారు. కనీసం ఇచ్చిన ఐదు రకాల జీవోల ప్రాథమిక నోటిఫికేషన్ను కూడా యజమానుల సంఘాలు అడ్డుకోవటంతో ప్రభుత్వం ఆపేసిందని గుర్తు చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు ముందే గిరిజన రిజర్వేషన్ల పెంచాలని డిమాండ్ చేశారు. ధరణి సమస్యలను పరిష్కరించాలని కోరారు. బీసీ కార్పొరేషన్, వివిధ వృత్తుల ఫెడరేషన్లకు నిధులు కేటాయించాలని సూచించారు. 57 ఏండ్లు నిండిన వారందరికీ ఆసరా పింఛన్లు ఇవ్వాలన్నారు. వరి వేయొద్దని చెప్పడంతో లక్షల మంది రైతులు నష్టపోయారనీ, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తునికాకు బోనస్ ప్రకటించాలనీ, డబుల్బెడ్రూం ఇండ్లు ఇవ్వాలనీ, పావలావడ్డీ రుణాలివ్వాలని కోరారు. గవర్నర్లు రాష్ట్రాల మీద పెత్తనం చేయడం సరైంది కాదని రాఘవులు ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. సమస్యలుంటే సీఎంలతో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. పీకే కాంగ్రెస్లో చేరడం ఆయన వ్యక్తిగతమని అన్నారు. సాంకేతిక ప్రక్రియ రాజకీయాలను నడపలేదనీ, కొంతవరకు మాత్రమే తోడ్పడతాయని చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా లౌకికశక్తులన్నీ కలిసి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ప్రత్యామ్నాయం అఖిల భారత స్థాయిలో సాధ్యం కాదన్నారు. రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు.
అంబేద్కర్ మీద ప్రేమ ఉంటే దళితుల పట్ల వివక్ష ఎందుకు? : తమ్మినేని
రాష్ట్రంలోనూ బీజేపీ ప్రమాదం పెరుగుతున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. బండి సంజరు పాదయాత్ర చేస్తున్నారనీ, ఆయన ఓ ఘటనకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 'ఇటీవల హనుమాన్ శోభాయాత్రలో జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని నడికుడి గ్రామంలో హనుమాన్ మాల వేసుకుని దళిత యువకుడు భోజనాలు వడ్డించాడు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలంతా బహిష్కరించారు. ఒకవైపు అంబేద్కర్ మీద ప్రేమను కనబరుస్తున్నారు. దళితులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకోవైపు దళితుల పట్ల వివక్షను ఎందుకు ప్రదర్శిస్తున్నారు. ఈ వివక్షకు వ్యతిరేకంగా ఏమైనా కార్యక్రమాలు చేశారా?. అంబేద్కర్ను పొగిడితే సరిపోదు. ఆయన ఆశయాలను ఆ కార్యక్రమాలు బీజేపీ ఏమైనా చేస్తున్నదా?. కుల వివక్షపై పోరాడుతున్నదా?. కుల నిర్మూలన సిద్ధాంతానికి బీజేపీ అనుకూలమా, వ్యతిరేకమా?. ఇవీ తేల్చి చెప్పాలి. నడికుడి గ్రామానికి వెళ్లేందుకైనా మేం సిద్ధం. బండి సంజరు సిద్ధమా? దీనిపై సమాధానం చెప్పాలి'అని తమ్మినేని డిమాండ్ చేశారు.