Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాడీవేడిగా జీఆర్ఎంబీ
- సీలేరులో రాష్ట్ర వాటాకు డిమాండ్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
గెజిట్ నోటిఫికేషన్ అమలు, బోర్డు నిర్వహణ, ప్రాజెక్టుల డీపీఆర్లపై హైదరాబాద్లో జరిగిన జీఆర్ఎంబీ సమావేశంలో వాడీవేడీ చర్చ చోటుచేసుకుంది. సీలేరు ప్రాజెక్టులో తెలంగాణ వాటాపై కూడా సుదీర్ఘంగా మాట్లాడారు. కాగా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు అభ్యంతరాలను వ్యక్తం చేయగా, వాటిని జీఆర్ఎంబీ ఛైర్మెన్ తిరస్కరించారు. ఈమేరకు రాష్ట్ర సాగునీటి, ఆయకట్టు అభివృద్ధి శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ జలసౌధలో 13వ గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం బుధవారం జరిగింది. బోర్డు చైర్మెన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలపై ఘాటుగానే చర్చ చోటుచేసుకున్నట్టు సమాచారం. గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా కష్ణా బేసిన్కు ఏపీ మళ్లీస్తున్నదనీ, అందులో భాగంగా తెలంగాణకు 45 టీఎంసీల వాటా ఇవ్వాలని తెలంగాణ ఉన్నతాధికారులు జీఆర్ఎంబీని డిమాండ్ చేశారు. అంతేగాక రాష్ట్రానికి చెందిన చనాకా- కొరాటా ఆనకట్ట, చౌటుపల్లి హన్మంతురెడ్డి, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాల డీపీఆర్లపై, ఆంధ్రప్రదేశ్కు చెందిన వెంకటనగరం పంప్హౌస్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుల డీపీఆర్లపై కూడా మాట్లాడారు. తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి అన్ని అనుమతులు ఉన్నాయనీ, సీడబ్ల్యూసీకి తాము నివేదక పంపించినట్టు రజత్కుమార్ తెలియజేశారు. ఈ సమావేశంలో ఏపీ నుంచి పలు అభ్యంతరాలు వ్యక్తం కాగా, వాటిని జీఆర్ఎంబీ ఛైర్మెన్ తిరస్కరించినట్టు ఆయన చెప్పారు. గెజిట్ నోటిఫికేషన్పై సబ్కమిటీ ద్వారా వివరాలు అధ్యయనం చేసి నివేదిక ఇస్తారన్నారు. బోర్డు ఛైర్మెన్ ఎంపీ సింగ్ అన్ని అంశాలను నోట్ చేసుకున్నారని తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ ఇంజీనిర్ ఇన్ చీఫ్ మురళీధర్రావు, ఓఎస్డీ శ్రీధర్ దేశ్పాండే, ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్రెడ్డి, ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.