Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్లో 3.3 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టెక్ దిగ్గజం గూగుల్తో రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా అమెరికాలోని మౌంటెన్ వ్యూలో ఉన్న తమ ప్రధాన కార్యాలయం తర్వాత గూగుల్ 3.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్లో రెండవ అతిపెద్ద క్యాంపస్ను నిర్మించనున్నది. దీనికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ గురువారం శంకుస్థాపన చేశారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పౌర సేవలు, విద్య, ఇతర రంగాల్లో సాంకేతిక సహకారాన్ని అందించనున్నది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఇప్పటికే అనేక ప్రాజెక్టుల్లో గూగుల్తో కలిసి పని చేస్తున్నామని తెలిపారు. తాజా ఒప్పందంతో మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్లో గూగుల్ తన మూలాలను మరింత బలోపేతం చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గూగుల్ 2017 నుంచి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నదని చెప్పారు. గతంలో చేసుకున్న ఎంవోయూలు గొప్ప కార్యక్రమాలకు దారి తీశాయని గుర్తుచేశారు. యువత, మహిళలు, విద్యార్థులు, పౌరసేవల్లో మార్పు తీసుకురావడంపై దృష్టి సారించామని కేటీఆర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గూగుల్ ఇండియా కంట్రీ హెడ్, వైస్ ప్రెసిడెంట్ సంజరు గుప్తా తదితరులు పాల్గొన్నారు.