Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ భద్రతా ప్రమాణాలు పాటించాలి
- విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా వసతులు సమకూర్చాలి
- కలెక్టర్లకు మంత్రిసబిత ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వచ్చే నెలలో జరగనున్న ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. వాటి పరీక్షల నిర్వహణకు సంబంధించి గురువారం హైదరాబాద్లోనితన కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్శంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కోవిడ్ భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పరీక్షలను నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులు ప్రత్యేక దష్టి సారించాలని సూచించారు. ముందుగా పరీక్షా కేంద్రాలను సందర్శించి వసతులు కల్పించాలని అధికారులను కోరారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు 9,07,396 మంది విద్యార్థులు, పదో తరగతి పరీక్షలకు 5,09,275 మంది విద్యార్థులు హాజరవుతున్నారని మంత్రి వివరించారు. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పరీక్షా సమయంలో నిరంతర విద్యుత్ ప్రసారం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందిని, ఓఆర్ఎస్ ప్యాకెట్లను, మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. మంచినీటి సౌకర్యం కల్పించాలనీ, విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరేందుకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడపాలని కోరారు. పరీక్షా కేంద్రాల చుట్టు పక్కల జిరాక్స్ షాపులను మూసివేయాలనీ, 144 సెక్షన్ విధించాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో ఫర్నీచర్ అందుబాటులో లేకపోతే సమకూర్చుకోవాలనీ, ఇందుకయ్యే వ్యయాన్ని ప్రభుత్వం అందజేస్తుందని మంత్రి అన్నారు. పరీక్షలంటే భయాందోళనలకు గురయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్, పాఠశాల విద్య సంచాలకులు శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు.