Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడేండ్లుగా అందని హమాలీ డబ్బులు
- ఉమ్మడి జిల్లాలో రూ.2.80 కోట్లు పెండింగ
- కొనుగోలు కేంద్రాల్లో హమాలీ చార్జీల పెంపు
- రైతులపై ఆదనపు భారం
- ప్రభుత్వం చెల్లించాల్సిన వాటిలో కోతలు
- కేంద్రం నిబంధనల మేరకే హమాలీ చెల్లింపులు నిలిపివేత
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయించిన వరి ధాన్యం హమాలీ చార్జీల చెల్లింపులకు ప్రభుత్వం ఎగనామం పెట్టింది. మూడేండ్లుగా రైతులకు చెల్లించాల్సిన బిల్లులు ఇవ్వకుండా నిలిపివేసింది. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల్లో పనిచేస్తున్న హమాలీ కార్మికులు చార్జీల పెంపుతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మాత్రం హమాలీ బిల్లుల చెల్లింపులపై సడిసప్పుడు లేకుండా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తూ.. కేంద్రం నిబంధనల మేరకే హమాలీ చార్జీలు నిలిపివేసినట్టు చెబుతుంది. కేంద్రం దయదలిస్తే తప్ప ఇప్పట్లో రైతులకు హమాలీ బిల్లు ఇచ్చేది లేదంటూ అధికారులు తెగేసి చెబుతున్నారు. దాంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర పక్కన పెడితే.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించేందుకు చార్జీలు తడిసి మోపడవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వరి సాగు రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి హమాలీ బిల్లుల కోసం మూడేండ్లుగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 74,255 మందికి గాను హమాలీ బిల్లుల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు రూ.2 కోట్ల 80 లక్షలు రావాల్సి ఉంది. రంగారెడ్డిలో ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు 2020-21 వానాకాలంలో 2,698 మంది రైతుల నుంచి 11,200 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా రూ.6,16,000 హమాలీ బిల్లులు చెల్లించాల్సి ఉంది. యాసంగిలో 74,278 మెట్రిక్ టన్నుల ధాన్యానికి 15,283 మంది రైతులకు రూ.40,85,291, 2021-22 వానాకాలం సీజన్లో 9,839 మంది రైతుల నుంచి ప్రభుత్వం 43,564 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా ఇందుకుగాను హమాలీ చార్జీల కింద రూ.73,96,020 చెల్లించాల్సి ఉన్నది. ఇక వికారాబాద్ జిల్లాలో గతేడాది వానాకాలం, యాసంగి సీజన్లలో 37,659 మంది రైతుల నుంచి సేకరించిన ధాన్యం 1,89,689 మెట్రిక్ టన్నులు, కాగా ఇందుకు గాను రూ. కోటి 43లక్షలు చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది వానాకాలంలో 1 లక్ష 14 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 18779 మంది రైతుల నుంచి సేకరించారు. ఇందుకు హమాలీ చార్జీలు ప్రభుత్వం తమ వాటా కింద రూ.62,97,445 చెల్లించాల్సి ఉంది. ఇవన్నీ ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి.
కేంద్రం అమోదంతోనే బిల్లులు చెల్లింపు
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు నింపి కాంటా వేయడం, లారీలకు ఎత్తడానికి హమాలీలకు రైతుల నుంచి క్వింటాకు రూ. 25 నుంచి 30 చెల్లిస్తున్నారు. ఇందులో ప్రభుత్వం వాటా కింద రైతులకు రూ. 5.50 చొప్పున చెల్లించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఆ చెల్లింపులకు స్వస్తి చెప్పింది. 2019 నుంచి ప్రభుత్వం హమాలీ బిల్లులు నిలిపివేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే.. కేంద్రం మీద.. కేంద్రాన్ని అడిగితే.. రాష్ట్ర ప్రభుత్వం మీద సాకులు చెప్పుకోవడం తప్ప రైతులకు న్యాయం జరిగింది లేదు. కేంద్రం నిబంధనల మేరకు రైతులకు చెల్లించాల్సిన హమాలీ బిల్లులు నిలిపివేయడం జరిగిందని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఏడాదయినా వస్తాయో రావో తెలియని పరిస్థితి ఉందని, కేంద్రం గైడ్లైన్స్ వస్తే తప్ప హమాలీ బిల్లు ఇవ్వడానికి లేదని అధికారులు తెగేసి చెప్పుతున్నారు. దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా హమాలీ చార్జీలు పెరిగాయి. దాంతో రైతులపై అదనపు భారం పడుతుందని రైతు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వం వాటా కింద రైతులకు చెల్లించాల్సిన హమాలీ చార్జీలను పునరుద్ధరించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
హమాలీ బిల్లులు ప్రభుత్వం చెల్లించాలి
ఏండ్ల కొద్దిగా పేరుకుపోయిన హమాలీ బిల్లులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి. ప్రస్తుతం పెరిగిన ధరల మేరకు హమాలీ చార్జీలు పెరిగాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయ ఖర్చులు గతం కంటే రెండింతలైనవి. రైతులపై అదనపు భారం పడుతుంది. ప్రభుత్వం గతంలో మాదిరిగా హమాలీ బిల్లులు చెల్లించి రైతులను ఆదుకోవాలి.
-మదుసుధన్ రెడ్డి, తెలంగాణ రైతు సంఘం,
రంగారెడ్డి జిల్లా కార్యదర్శి