Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దర్శక రచయిత, కవి బి.నర్సింగరావు
- 'అలోలాంతరాళాలలో' పుస్తకావిష్కరణ
నవతెలంగాణ- బంజారాహిల్స్
కళారంగానికి ప్రాంతాలతో ప్రమేయం ఉండదని, రెండు తెలుగు రాష్ట్రాలు చిత్ర కళారంగాన్ని చిన్నచూపు చూస్తున్నాయని ప్రముఖ దర్శక రచయిత, కవి బి.నర్సింగరావు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లు అయినప్పటికీ చిత్రలేఖనం, శిల్ప కళ వైపు ప్రభుత్వం దృష్టి సారించలేదన్నారు. శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ప్రఖ్యాత చిత్రకారుడు, కవి పద్మశ్రీ ఎస్.వి.రామారావు రచించిన 'అలోలాంతరాళాలలో' పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ.. ఆధునిక యాబ్స్ట్రాక్ట్ చిత్రకళను, కవిత్వాన్ని అర్థం చేసుకుని అనుభూతి చెందాలని, రామారావు కవిత్వం అద్భుత అనుభూతినిస్తుందని చెప్పారు. ప్రపంచంలోనే మేటి తెలుగు చిత్రకారుడైన ఎస్.వి.రామారావు రచనలు, చిత్రకళతో మ్యూజియం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రచయిత వాడ్రేవు చినవీరభద్రుడు మాట్లాడుతూ.. చిత్రకారులు కవులుగా ప్రాచుర్యం పొందడం ప్రపంచవ్యాప్త సంప్రదాయంగా కొనసాగుతున్నదని, అందులో రామారావు తెలుగు వారు కావడం గర్వకారణం అని అభినందించారు. ఖగోళంలో చైతన్యాన్ని అన్వేషిస్తూ సాగిన కవిత్వం ఆసక్తికరంగా ఆలోచనాభరితంగా ఉందని కితా బునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్ర మూర్తి, చిత్రకారులు ఆనంద్ గడపా, గిరిధర్ గౌడ్, టి.శివాజి, పున్నా కృష్ణమూర్తి, పద్మలత, తెనాలి ప్రచురణ కర్త సురేష్, ఆర్యదేవ, డాక్టర్ మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.