Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 13న పాఠశాలలు పున:ప్రారంభం
- అప్పటికి మన ఊరు-మనబడి పనులు పూర్తికావాలి : అధికారులకు మంత్రివర్గ ఉపసంఘం ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వచ్చే విద్యా సంవత్సరంలో జూన్ ఒకటి నుంచి 12వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని చేపట్టాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. జూన్ 13వ తేదీన బడులు పున:ప్రారంభమయ్యే నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించడంతోపాటు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్న వివరాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించాలని నిర్ణయించింది. విద్యా సంవత్సరంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి సమావేశాలను విధిగా ఏర్పాటు చేయాలని సూచించింది. శనివారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో 'మనఊరు-మనబడి' కార్యక్రమంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశాన్ని నిర్వహించారు. మంత్రులు కెటి రామారావు, టి హరీశ్రావు, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, వి శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్కుమార్ పాల్గొన్నారు. అనంతరం సబితా ఇంద్రారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 'మనఊరు-మనబడి' కార్యక్రమంలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేయాలని నిర్ణయించామని తెలిపారు. లక్ష్యాలకు అనుగుణంగా ఈ పనులను చేపట్టి విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి పాఠశాలల్లో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతీవారం వీడియోకాన్ఫెరెన్సును నిర్వహించి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించామని పేర్కొన్నారు. వచ్చేనెలలో ప్రారంభం కానున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో భాగంగా విద్యా సంస్థల్లో మొక్కలు నాటేందుకు, పచ్చదనాన్ని పెంచేందుకు రెండు, మూడు రోజులు కేటాయించాలని తెలిపారు. ఆకర్షణీయమైన పాఠశాల భవనం, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనేలా చూడటంతోపాటు విద్యార్థులను పాఠశాలల వైపు ఆకర్షితులను చేసేందుకు అవసరమైన చర్యలన్నింటినీ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే టీ ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని దాదాపు 30 వేల విద్యా సంస్థలన్నింటికీ బ్యాండ్విడ్త్ సౌకర్యాన్ని కల్పించబోతున్నామని వివరించారు. తద్వారా భవిష్యత్లో డిజిటల్ ఎడ్యుకేషన్ను విద్యార్థులకు అందించడం సులభమవుతుందని ఆమె పేర్కొన్నారు. పాఠశాల స్థాయిలో కొత్తతరం పిల్లల్లో ఔత్సాహికవేత్తలను ప్రోత్సహించేందుకు వీలుగా కరిక్యులమ్ రూపొందించాలని మంత్రివర్గం అభిప్రాయబడిందని తెలిపారు.
గురుకులాలు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఒకే కరిక్యులమ్
ప్రస్తుతం రాష్ట్రంలో సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించబోడుతున్న గురుకుల విద్యాసంస్థలకు, ఇతర ప్రభుత్వ విద్యాసంస్థలకు ఒకే కరిక్యులమ్, ఒకే విధానం ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు వీలుగా తన నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకూ క్రీడా పరికరాలను కొనుగోలు చేసేందుకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి ఒక్కో పాఠశాలకు రూ.50 వేల చొప్పున విడుదల చేయనున్నట్టు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు ప్రకటించారు. ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులూ ఈ విధంగా చేస్తే క్రీడలకు ఆదరణ పెరుగుతుందని ఆయన సూచించారు. పాఠశాలలు నడుస్తున్న ఆవరణలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు నడుస్తున్నట్లయితే వాటినీ అభివృద్ధి చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈ పథకంలో చేపట్టిన పనులను వేగవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఎ శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు.