Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వయోపరిమితి 65 ఏండ్లు పెంపునకు నిరాకరణ
- ప్రభుత్వ ఉత్తర్వులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రొఫెసర్లకు ఉద్యోగ విరమణ వయోపరిమితిని 60 నుంచి 65 ఏండ్ల పెంచాలన్న ప్రతిపాదనను నిరాకరించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయుల వయోపరిమితి కన్నా ముందే ప్రొఫెసర్లు ఉద్యోగ విరమణ పొందే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలోని ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయో పరిమితిని 58 నుంచి 61 ఏండ్లకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. అందుకనుగుణంగా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె రామకృష్ణారావు జీవో నెంబర్ 45ను 2021, మార్చి 30న విడుదల చేశారు. అయితే విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయస్సు ప్రస్తుతం 60 ఏండ్లు అమల్లో ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 61 ఏండ్లకు పెంచింది. విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది వయోపరిమితిని సైతం 58 నుంచి 61 ఏండ్లకు పొడిగించింది. అంటే మూడేండ్లు పెరిగింది. ఇంకోవైపు యూజీసీ నిబంధనల ప్రకారం కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయస్సు 65 ఏండ్లు అమల్లో ఉన్నది. దీని ప్రకారం విద్యాశాఖ అధికారులు మూడు ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 61 ఏండ్లు పెంచాలని, లేదంటే 63 ఏండ్లకు, యూజీసీ ప్రకారం 65 ఏండ్లు ఉండాలని ప్రతిపాదించారు. ఈ మూడు ప్రతిపాదనలనూ తిరస్కరిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు ఆందోళనలో ఉన్నారు.