Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమ్యూనిస్టులతోనే దేశానికి భవిష్యత్తు
- వామపక్ష ప్రజాతంత్ర సంఘటనపై దృష్టి
- సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో
- పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కమ్యూనిస్టులతోనే దేశానికి భవిష్యత్తు అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వామపక్ష ప్రజాతంత్ర సంఘటనపై దృష్టి సారించి శాస్త్రీయ దృక్పథంతో ప్రజా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా విస్తృతస్థాయి సమావేశం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు అధ్యక్షతన నగరంలోని ఎస్ఆర్ గార్డెన్స్లో మంగళవారం నిర్వహించారు. ఆ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. ఏప్రిల్లో కేరళలోని కన్నూరులో జరిగిన పార్టీ జాతీయ మహాసభలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర, జిల్లా పరిస్థితులకు అన్వయిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలను కార్యోన్ముఖులను చేశారు. దేశవ్యాప్తంగా మితవాద ధోరణులు పెరుగుతున్నాయన్నారు. ఓ వైపు బీజేపీ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తుంటే.. దీనికి వ్యతిరేకంగా లౌకికశక్తులను కూడగట్టడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. గ్రామీణ వ్యవసాయేతరులను సంఘటితం చేయాలన్నారు. నూతన విద్యావిధానానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ విద్యావిధానంపై దృష్టి సారించాలన్నారు. సాంస్కృతిక రంగం ఆలోచనా విధానంలో మార్పులు తీసుకు వచ్చేందుకు కృషి చేయాలని తెలిపారు. తెలంగాణలో వామపక్ష ప్రజాతంత్ర సంఘటన నిర్మాణం ఆవశ్యకతను వివరించారు. సమస్యలపై ఐక్య పోరాటాలను విస్తృతం చేయాలని సూచించారు. బూర్జువా పార్టీలు శాశ్వత ప్రాతిపదికన ఏ అంశాన్ని అమలు చేయవన్నారు. లౌకికతత్వం, విద్యా, వైద్యం, ఉద్యోగాల కల్పనకు కమ్యూనిస్టుల బలోపేతం అవసరమన్నారు. అటువంటి కమ్యూనిస్టులు లేకుండా దేశానికి భవిష్యత్తు లేదన్నారు. అంతకుముందు పార్టీ జాతీయ మహాసభ రాజకీయ తీర్మానంపై పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు ప్రసంగించారు. పార్టీ భవిష్యత్తు మూడేండ్ల కర్తవ్యాలను జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్లీనరీ ముందు ఉంచారు. ప్రారంభంలో ఇటీవల మరణించిన పార్టీ నాయకులకు నివాళి అర్పిస్తూ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, మాచర్ల భారతి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుగ్గవీటి సరళ, కళ్యాణం వెంకటేశ్వరరావు, భూక్యా వీరభద్రం, వై. విక్రమ్, బొంతు రాంబాబు, నవతెలంగాణ జీఎం ఎం. సుబ్బారావు, పార్టీ జిల్లా, మండల, ప్రజాసంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.