Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిపాదనకు రాష్ట్రం తిరస్కరణ
- కేఆర్ఎంబీలో వాదనలు
- చెరిసగం వాటా కావాల్సిందేనని స్పష్టీకరణ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కృష్ణా జలాలను 66:34 నిష్పత్తిలో పంపిణీ చేయాలనే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. రెండు రాష్ట్రాలకు చెరిసగం వాటా ఇవ్వాలని డిమాండ్ చేసింది. 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాల పంపిణీలో భాగస్వామ్యం కాబోమని స్పష్టం చేసింది. ఏపీ విభజన చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాలకు నీటి వాటా, శ్రీశైలం, నాగార్జునసాగర్లో 15 ఔట్లెట్లను బోర్డుకు అప్పగించడం, నిధుల కేటాయింపు, ఆర్డీఎస్పై చర్చలు, ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు తదితర కీలకాంశాలపై చర్చించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) శుక్రవారం హైదరాబాద్ ఎర్రమంజిల్ జలసౌధ వేదికగా సమావేశం జరిగింది. ఛైర్మెన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ బోర్డు భేటీలో సభ్యకార్యదర్శి రాయిపురే, సభ్యులు మౌంతాంగ్, ఆర్కే పిళ్లై, తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్, ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్, ఏపీ జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి, ఇంజినీర్లు పాల్గొన్నారు. విద్యుత్ ఉత్పత్తి, వరద సమయంలో వినియోగించిన నీటి వివరాలు, తదితర అంశాలపై కూడా చర్చించినట్టు తెలిసింది. ఏపీ 34 టీఎంసీలకు మించి తీసుకోరాదు. శ్రీశైలం జలాశయం నుంచి ఆంధ్రప్రదేశ్ 34 టీఎంసీలకు మించి తీసుకోరాదని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ అన్నారు. దురదష్టవశాత్తు కొత్త రాష్ట్రమైన తెలంగాణకు నీటి కేటాయింపుల అంశాన్ని ఇంకా ట్రిబ్యునల్కు నివేదించడం లేదని వ్యాఖ్యానించారు. కృష్ణా జలాలను 66:34 నిష్పత్తి ఒక్క ఏడాదికే అని గత సంవత్సరం అంగీకరించామన్న ఆయన... కృష్ణా జలాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెరిసగం వాటా ఇవ్వాలని కోరుతున్నామని తెలిపారు. ఈ విషయాన్ని రికార్డు చేయాలని బోర్డుకు ఇప్పటికే లేఖ కూడా రాసినట్టు ప్రకటించారు. శ్రీశైలం ప్రాజెక్టు ఉన్నదే విద్యుత్ ఉత్పత్తి కోసమన్న రజత్కుమార్, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్కు అభ్యంతరం తగదని ఆక్షేపించారు. పట్టిసీమ నుంచి గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు తలరిస్తున్నప్పటికీ, తెలంగాణ రాష్ట్రానికి అదనంగా రావాల్సిన నీరు ఇవ్వడం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు.
విద్యుదుత్పత్తికి నీటి విడుదలపై 2021-22 నీటి సంవత్సరంలో శ్రీశైలం నుంచి నీటి విడుదలపై ప్రత్యేకించి విద్యుదుత్పత్తి చేసేందుకు విడుదలపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. పోటీపడి విద్యుదుత్పత్తి చేశారనీ, తమ ఆదేశాలను ఉల్లంఘించారని ఎజెండాలో బోర్డు పేర్కొంది. తెలంగాణ 218 టీఎంసీల నీటిని వినియోగించుకొని 281 రోజుల్లో 1217 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయగా.. ఆంధ్రప్రదేశ్ 200 టీఎంసీలతో 183 రోజుల్లో 1146 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసింది. శ్రీశైలంలో గేట్ల ద్వారా నీటిని విడుదల చేసే అవకాశం లేనప్పుడూ విద్యుదుత్పత్తి చేశారనీ, మొత్తం 501 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రంలోకి వెళ్లాయనీ, ఇందులో ఎక్కువ నీటిని ఆదా చేయడానికి అవకాశం ఉందని బోర్డు పేర్కొంది. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు రూ.800 కోట్లు, నాగార్జునసాగర్, పులిచింతలకు మరో రూ.30 కోట్లు అవసరమని పేర్కొంటూ ఈ అంశాన్ని ఎజెండాలో చేర్చింది. తెలంగాణకు ఆర్డీఎస్లో 15.9 టీఎంసీల కేటాయింపు ఉండగా, చాలా కాలంగా ఈ మేరకు రావడం లేదు. దీన్ని ఎజెండాలో చేర్చి కర్నాటక, తుంగభద్ర బోర్డు ప్రతినిధులను కూడా ఆహ్వానించింది.