Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ ఐక్యతను దెబ్బతీస్తున్న బీజేపీ : సీపీఐ(ఎం) పొలీట్బ్యూరో
- సభ్యురాలు మాజీ ఎంపీ సుభాషిణి అలీ
- ఆవాజ్ ఆధ్వర్యంలో సెమినార్
నవతెలంగాణ - భువనగిరి/ధూల్ పేట్
దేశ ప్రజల శాంతియుత జీవనానికి.. సోదర తత్వాన్ని పెంపొందించడానికి.. దేశాన్ని సమైక్యంగా ముందుకు తీసుకెళ్లడానికి సెక్యులరిజమే రక్షణ అని మాజీ ఎంపీ, సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు సుభాషిణి అలీ చెప్పారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో ఆవాజ్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ఎంఏ.ఇక్బాల్ అధ్యక్షతన ''మతోన్మాద నూతన సవాళ్లు, సెక్యులరిజం, పరిరక్షణ కర్తవ్యాలు'' అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సెక్యులరిజాన్ని బలహీనపరచే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. స్వాతంత్య్రానికి పూర్వం ఐక్యంగా కలిసి ఉన్న భారత ప్రజలను విడదీసేందుకు బ్రిటీష్ ప్రభుత్వం అనేక కుతంత్రాలు చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు అదే పద్ధతిని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తూ దేశ ఐక్యతను దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం నుంచి సెక్యులరిజం అనే పదాన్ని తీసేయాలని కుట్ర చేస్తోందన్నారు. అనాదిగా భారతదేశంలో సర్వమత సమ్మేళనం, భిన్నత్వంలో ఏకత్వం, వివిధ ఆచార సంప్రదాయాలు ఉన్నా ఏనాడూ ఒకరి మతాన్ని ఒకరు గాయపర్చుకునేలా చర్యలు జరగలేదని చెప్పారు. నేడు సామరస్యాన్ని దెబ్బతీసే శక్తులను సమిష్టిగా ఎదుర్కోవాలన్నారు.
ప్రజలపై భారాలు మోపుతున్న బీజేపీ అన్ని రంగాలను భ్రష్టు పట్టించి దేశాన్ని అధోగతి పాలు చేసిందని విమర్శించారు. ప్రజలపై భారాలు వేస్తూ సామాన్య మధ్యతరగతిని దివాలా తీయించిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజా సమస్యలపై పోరాడేందుకు బీజేపీయేతర శక్తులు, అట్టడుగు వర్గాల ప్రజలందరూ పోరాటంలోకి రావాలని పిలుపునిచ్చారు. సెక్యులరిజాన్ని బలహీనపరిచి రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలనుకున్న బీజేపీని మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలో అరాచకం రాజ్యమేలుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎండి.అబ్బాస్ మాట్లాడుతూ.. వెనుకబాటుకు గురవుతున్న ముస్లిం సమాజాన్ని కేవలం ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, ఉపాధి రంగాల్లో 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా సిఫారసుల అమలుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. ప్రముఖ న్యాయవాది ఎంఏ.రహీమ్ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలో ఉన్న ఎనిమిదేండ్ల కాలంలో ప్రతి అంశాన్ని మత కోణంతోనే చూస్తున్నారని, వ్యక్తిగతమైన మతాన్ని రాజకీయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మత రాజకీయాల పట్ల అభ్యుదయవాదులు, ప్రజాస్వామ్యవాదులు ఒక్కటై నిలదీయాలన్నారు.
సామాజికవేత్త బట్టు రామచంద్రయ్య మాట్లాడుతూ.. బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం బీజేపీకి మింగుడు పడడం లేదని, మనువాద సిద్ధాంతాన్ని సంఫ్ు పరివార్ శక్తులు ముందుకు తెస్తున్నాయని తెలిపారు. దళిత బహుజనులు ఐక్యమై పోరాడే సమయం ఆసన్నమైందన్నారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి.జహంగీర్, జిల్లా కార్యదర్శి మీర్ ఖాజా అలీ, గౌరవాధ్యక్షులు లతీఫ్, ఇక్బాల్ చౌదరి,షేక్ మీరా, మీర్ యూసుఫ్ అలీ,ముక్తార్ ఉసేన్, ఎండి.ఖయ్యుం, మన్సూర్ అలీ, ఇమామ్ పాషా, మునిరుద్దీన్, సయ్యద్ ఉమర్, బద్రోద్దీన్, అక్బర్, రేష్మ, హర్ష, ముంతాజ్ బేగం పాల్గొన్నారు.
ప్రజలను మతోన్మాదంవైపు మళ్లిస్తున్న బీజేపీ
దేశంలో బీజేపీ ప్రజలను మనుషులుగా కాకుండా మతం కోణంలో చూస్తూ మతోన్మాదంవైపు మళ్లిస్తూ కలహాలు సృష్టిస్తోందని మాజీ ఎంపీ, సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు సుభాషిణి అలీ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రజలపై ఆర్థిక భారాలు మోపుతోందని చెప్పారు. మనుషులను మనుషులుగా చూడకుండా వారి భావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఆవాజ్ హైదరాబాద్ సౌత్ కమిటీ ఆధ్వర్యంలో ''న్యూ ఫేస్ ఆఫ్ కమ్యూనలిజం'' అంశంపై మొగల్ పురా ఉర్దూఘర్ హాల్లో శనివారం సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాషిణి అలీ మాట్లాడుతూ.. నాడు ప్రజల్లో ఐక్యతను తీసుకొచ్చేందుకు సుభాష్ చంద్రబోస్ జైహింద్ నినాదంతో కృషి చేశారని చెప్పారు. ఇటువంటి విషయాలను బీజేపీవారు పట్టించుకోకుండా హిందూ ముస్లింల మధ్య విభేదాలను సృష్టిస్తున్నారని, ప్రజల ఐక్యతాభావాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలో కాలా బాబా, బాబా వంటి వాటిని చూపెడుతూ భయాందోళన సృష్టిస్తున్నారని తెలిపారు. దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ, ఏడాదికి కోట్లలో ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చే కంపెనీ అయిన ఎల్ఐసీని అమ్మడానికి బీజేపీ సిద్ధ పడిందన్నారు. లాభం వచ్చే ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ, అదానీ వంటి కార్పొరేట్లకు కట్టబెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఏ చిన్న కంపెనీలో కార్మికులకు కష్టం వచ్చినా, ధరలు పెంచినా పనులు బంద్ పెట్టి ధర్నాలు, బైకాట్లు చేసేవారని, ప్రస్తుతం ప్రజలు ఇటువంటి సమస్యలపై దృష్టిసారించకుండా.. బీజేపీ వారు ప్రజలను మత భావాలవైపు మళ్లిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 1950లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ముస్లింలను ఖతం చేయాలంటూ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడ్డాయని గుర్తు చేశారు. నాటి బీజేపీ ప్రధాని ముస్లింలు లేకపోతే తమకు రాజకీయం, రాజ్యాధికారం ఎలా వస్తుందన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం యూపీలో మతతత్వం రాజ్యమేలుతోందన్నారు. మరోపక్క రోజురోజుకూ దళితులపై దాడులు పెరుగుతున్నాయని చెప్పారు. హిందుస్థాన్ని పూర్తిగా మనువాద సమాజంగా చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎండి. ఇక్బాల్ జావిద్, ఆవాజ్ నగర కార్యదర్శి అబ్దుల్ సత్తార్, ఉపాధ్యక్షులు అబ్దుల్ లతీఫ్, స్వచ్ఛంద సంస్థ కోవా హుస్సేన్ కరీముద్దీన్, ఆవాజ్ కమిటీ ఉపాధ్యక్షులు బాబర్ ఖాన్, ఆయూబ్ఖాన్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.