Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆన్లైన్లో సమర్పణకు జూన్ 4 వరకు గడువు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పాలిటెక్నిక్, డిప్లొమాతోపాటు ఆర్జీయూకేటీ బాసర త్రిపుల్ఐటీలో ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో 2022-23 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలిసెట్) దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణా మండలి (ఎస్బీటీఈటీ) కార్యదర్శి, పాలిసెట్ కన్వీనర్ డాక్టర్ సి శ్రీనాథ్ శనివారం నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి తుదిగడువు జూన్ నాలుగో తేదీ వరకు ఉందని పేర్కొన్నారు. ఆలస్య రుసుం రూ.100తో అదేనెల ఐదో తేదీ వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశముందని వివరించారు. జూన్ 30న పాలిసెట్ రాతపరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. పరీక్ష జరిగిన 12 రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు వివరాల కోసం sbtet.telangana.gov.in, www.polycetts.nic.in వెబ్సైట్లను, 040-23222192 నెంబర్ను సంప్రదించాలని సూచించారు. పాలిసెట్ ద్వారా జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్ కోర్సులు, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయంలో హార్టికల్చర్ డిప్లొమా కోర్సులు, పివి నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయంలో పశుసంవర్ధక, ఫిషరీస్ కోర్సుల్లోనూ ప్రవేశాలుంటాయని వివరించారు.