Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ను వదలండి.. జనంలో ఉండండి...
- ఢిల్లీని కాదు.. ప్రజలను నమ్ముకోండి...
- అప్పుడే మీకు టిక్కెట్లు, భవిష్యత్తు
- కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలి : రాహుల్ గాంధీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్ వదలిపెట్టి గ్రామాల్లో తిరగాలని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ ఆ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఢిల్లీలో బ్యాక్డోర్ పౖౖెరవీలు చేసేవారికి టికెట్లు రావన్నారు. ప్రజల్లో తిరిగేవారికే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఎంతటి సీనియర్లయినా సరే...పార్టీ కోసం పనిచేయని వారికి టికెట్లు దక్కబోవని హెచ్చరించారు. వ్యక్తిగతంగా ఒక్కొక్కరి గురించి సర్వే చేసి టికెట్లు కేటాయిస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే యుద్ధం ఉంటుందని చెప్పారు. నిరంకుశంగా పాలిస్తున్న కేసీఆర్ను తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో తెలంగాణ ప్రజలకు న్యాయం జరగడం లేదని తెలిపారు. కేసీఆర్ కుటుంబం నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే కాంగ్రెస్ గెలవాలని అన్నారు. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో యువత కదిలిరావాలని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
శనివారం హైదరాబాద్లోని గాంధీభవన్లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులతో రాహుల్ భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలంటూ వారికి దిశానిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్ వెనుక ధనం, పోలీసులు మాత్రమే ఉన్నారనీ, ప్రజలు లేరని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయికి వెళ్లటం ద్వారా తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తమ పార్టీ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనీ, నిరంకుశత్వానికి ఏమాత్రం తావుండబోదని అన్నారు. వరంగల్ డిక్లరేషన్ గురించి ప్రతి వ్యక్తికీ, ప్రతి రైతుకు వివరించాలని కోరారు. దాని గురించి చిన్న పిల్లలకు కూడా తెలియాలన్నారు. వరంగల్లో చెప్పింది డిక్లరేషన్ మాత్రమే కాదు.. ప్రజలు, కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య ఉన్న ఒప్పందానికి అది నిదర్శనమని పేర్కొన్నారు. నాయకుల మధ్య అభిప్రాయబేధాలు సహజమని చెప్పారు. అయినా ప్రతి ఒక్కరి అభిప్రాయాలు, ఆలోచనలు వింటామని తెలిపారు. నాయకులు ఏ విషయాన్నైనా తనతోనే నేరుగా చర్చించాలని సూచించారు. మీడియా ముందుకొచ్చి ఆరోపణలు చేసుకోవద్దని హితవు పలికారు. తెలంగాణలో ఎనిమిదేండ్లుగా అరాచక పాలన కొనసాగుతోందని అన్నారు. రాష్ట్ర సంపదనంతా ఒక కుటుంబం దోచుకుంటోందని దుయ్యబట్టారు. ఎన్నో ఆశయాలతో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారనీ, కానీ..ప్రజల ఆకాంక్షలు మాత్రం నెరవేరటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
జైల్లో ఎన్ఎస్యూఐ నేతలను పరామర్శించిన రాహుల్గాంధీ
అంతకుముందు రాహుల్ గాంధీ చంచల్గూడ జైలులో ఎన్ఎస్యూఐ నేతలతో ములాఖత్ అయ్యారు. వారిని పరామర్శించి పార్టీ తరఫున భరోసానిచ్చారు. 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై పోరాడాలి.. మీ వెంట మేమున్నాం...' అని వారికి ఆయన ధైర్యం చెప్పారు. ఆయన వెంట సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఉన్నారు. రేవంత్, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నేతలకు అనుమతి నిరాకరించారు. దీంతో వారు జైల్ బయట ఉండాల్సి వచ్చింది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఒకరిని పరామర్శించేందుకు ముగ్గురికి అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని చెప్పారు. తెలంగాణలో రాహుల్గాంధీకి ఏం పని అంటూ టీఆర్ఎస్ నేతలు విమర్శించడాన్ని తప్పుపట్టారు.
ఉద్యమకారులతో రాహుల్ భేటీ
ఆకాంక్షలు నెరవేరలేదని ఆవేదన
తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరలేదంటూ పలువురు తెలంగాణ ఉద్యమకారులు రాహుల్గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆకల సాకారం కావడం లేదని తెలిపారు. శనివారం హైదరాబాద్లోని ఓ హోటల్లో తెలంగాణ ఉద్యమకారులు, మేధావులతో విడివిడిగా భేటీ అయ్యారు. ప్రజాగాయకుడు గద్దర్, ప్రొఫెసర్ హరగోపాల్, ఇంటిపార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్, ఫ్రొఫెసర్లు కంచె ఐలయ్య, ఇటిక్యాల పురుషోత్తం, జయెద్ అలీఖాన్తో విడివిడిగా రాహుల్ భేటీ అయ్యారు. ఉద్యమకారుల అభిప్రాయాలు, సూచనలు తెలుసుకున్నారు. అనంతరం నేతు నక్లెస్రోడ్లోని సంజీవయ్య పార్క్లోని దామోదరం సంజీవయ్య 50వ వర్దంతి సందర్భంగా సంజీవయ్య విగ్రహానికి నివాళులర్పించారు. టీపీసీసీత అధ్యక్షులు రేవంత్రెడ్డితోపాటు పలువురు నేతలు ఉన్నారు.
అమరవీరుల స్మారక చిహ్నం సందర్శించిన రాహుల్
ట్యాంక్బండ్ అమరవీరుల స్మారక చిహ్నం ప్రాంతాన్ని రాహుల్గాంధీ సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. అమరవీరుల స్థూపం నిర్మాణంలో కూడా అవినీతి జరుగుతుందనీ, నిరూపిస్తామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి మీడియాతో సవాల్ చేసిన నేపథ్యంలో రాహుల్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. గాంధీభవన్లో కార్యక్రమాన్ని ముగించుకుని ఆకస్మాత్తుగా అమరవీరుల స్థూపం వద్దకు రాహుల్ వెళ్లారు. అక్కడ నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు బయలుదేరి ఢిల్లీ వెళ్లారు.