Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 90.91శాతం విద్యార్థుల హాజరు
- అధికారులకు మంత్రి అభినందనలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (వీటీజి సెట్-2022 ) ప్రశాంతంగా ముగిసిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో 2022 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల కోసం ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రవేశ పరీక్షకు లక్షా 34వేల 478 మంది బాలబాలికలు హాజరయ్యారన్నారు. గత విద్యా సంవత్సరంలో 74,052 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారని గుర్తుచేశారు. గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో 48, 120 మంది విద్యార్థినీ విద్యార్థులకు ప్రవేశాలు లభిస్తాయని తెలిపారు. ఒక్కో సీటు కోసం సగటున ముగ్గురు విద్యార్థులు పోటీ పడ్డారని పేర్కొన్నారు.
పెద్ద సంఖ్యలో గురుకులాలను ప్రారంభించటంతో ఉచితంగా ఇంగ్లీష్ మీడియంలో ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు పోషకాహారాన్ని అందిస్తుండడంతో ప్రవేశాల కోసం పోటీ పెరిగిందన్నారు. ప్రతిష్ఠాత్మకమైన ప్రవేశ పరీక్షను విజయవంతంగా, ప్రశాంతంగా నిర్వహించినందుకు ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్తో పాటు అన్ని సొసైటీలకు చెందిన అధికారులు,సిబ్బందిని అభినందించారు. ఇదే ఉత్సాహంతో ఫలితాలు ప్రకటించి, అడ్మిషన్లు సకాలంలో పూర్తి చేయాల్సిందిగా మంత్రి కొప్పుల అధికారులను ఆదేశించారు.