Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోయినపల్లి వినోద్ కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మాదిగలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనీ, తద్వారా ఆర్థిక స్వావలంబన సాధించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ సూచించారు. మంగళవారం హైదరాబాద్లోని బేగంపేటలో జరిగిన మాదిగ ఇండిస్టీయల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ ( మిక్కీ ) మొదటి వార్షిక సమావేశంలో ఆయన పాల్గొని దాని వెబ్సైట్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలో పెరుగుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలనీ, ప్రస్తుత కాలంలో ప్రతిభ ముఖ్యమనీ, టాలెంట్ ఎదుట కులాలు మతాలు ఏవీ పని చేయవని స్పష్టం చేశారు. గతంలో ఉన్న సామాజిక అసమానతలు ఇప్పుడు లేవని ఆయన తెలిపారు. దాదాపు 20 ఏండ్ల కింద ఉద్యమ నేత, టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో దళిత పాలసీ సమావేశం జరిగిందనీ, నాటి సమావేశం స్ఫూర్తితోనే దళిత బంధు స్కీం అమలు జరుగుతోందని చెప్పారు. మాదిగ పారిశ్రామికవేత్తలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ రకాల రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని వినోద్ కుమార్ సూచించారు. మిక్కీ సభ్యుల అభ్యున్నతి కోసం తన వంతు సహకారాన్ని అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, కర్నాటక రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ , రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, అమెరికా పారిశ్రామికవేత్త డాక్టర్ పగిడిపాటి దేవయ్య, మిక్కీ అధ్యక్షులు సుంచు రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి బక్క నరసింహ, సలహాదారులు ఆరేపల్లి రాజేందర్, వంశీ తిలక్, గంధం రాములు, కొమ్ముల నరేందర్, జయరాజ్ తెన్నేటి, సాయి కుమార్, తదితరులు పాల్గొన్నారు.