Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ బాధ్యత సర్కారుదే
- ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయండి
- యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ ఉద్యోగులకు నగదురహిత వైద్యం అమలు కోసం ఉద్యోగుల వేతనాల నుంచి రెండు శాతం చందా చెల్లిస్తామని టీఎన్జీఓ కేంద్ర సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి అంగీకారపత్రం ఇవ్వడాన్ని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) స్టీరింగ్ కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు స్టీరింగ్ కమిటీ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. సంక్షేమ రాజ్యంలో ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ బాధ్యత పూర్తిగా ఆయా ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది. ఆ కారణంగానే మెడికల్ రీయింబర్స్మెంట్/ మెడికల్ అలవెన్సు సౌకర్యాలు కల్పించబడ్డాయని తెలిపింది. కార్పొరేట్ వైద్యం ఖరీదైన కారణంగా మెడికల్ రీయింబర్స్మెంట్ గరిష్ఠ పరిమితి పెంచాలని కోరినపుడు 2008లోనే నగదురహిత వైద్యం ప్రతిపాదన మొదటిసారి చర్చకువచ్చిందని గుర్తు చేసింది. ఇన్సూరెన్స్ సంస్థలతో పలుదఫాల చర్చల తర్వాత ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేశారని పేర్కొంది. ఉద్యోగుల నుంచి నామమాత్రపు చందాతో నగదురహిత వైద్యం అమలు చేయాలని నిర్ణయించారని తెలిపింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులందరికీ ఆరోగ్య కార్డులపై పరిమితి లేకుండా నగదురహిత వైద్యం ఉచితంగా అందజేస్తామని ప్రకటించిందని పేర్కొంది. 2017 నుంచి మూడేండ్లు నగదురహిత వైద్యం అందినప్పటికీ ఇటీవల (ప్రధానంగా కోవిడ్ ప్రబలినప్పటినుంచి) కార్పొరేట్ ఆస్పత్రులు ఆరోగ్య కార్డులపై వైద్యానికి అనుమతించటంలేదని ఆందోళన వ్యక్తం చేసింది. వాటి యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించటం లేదనే కారణం చెప్తున్నాయని తెలిపింది.
బాధ్యత కలిగిన ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో చర్చించి సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలని సూచించింది. లేదంటే ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేసి ప్రజలతోపాటు ఉద్యోగులకూ నాణ్యమైన వైద్యం ఉచితంగా అందించమని డిమాండ్ చేయాలని కోరింది. అందుకు భిన్నంగా అడక్కుండానే చందా ఇస్తామనీ, కార్పొరేట్ వైద్యం అందించమంటూ పదే పదే వేడుకోవటం కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీకి సహకరించటానికేమోననే అనుమానాలు కలుగుతున్నాయని తెలిపింది. పీఆర్సీ కమిటీ వద్ద ఏకపక్షంగా వైద్యానికి ఒక శాతం చందా ఇస్తామన్నారని గుర్తు చేసింది. ఉద్యోగులు ఇస్తామంటున్నారు కనుక ప్రభుత్వం ఒకశాతం చందా మినహాయించుకుని నగదురహిత వైద్యం అమలు చేయమని సిఫారసు చేసిందని తెలిపింది.ఆ అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకముందే రెండు శాతం చందా ఇస్తామంటూ అంగీకారపత్రం ఇవ్వటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది.ఉద్యోగులందరికీ టీఎన్జీఓ సంఘం మాత్రమే ప్రతినిధి కాదని తెలిపింది.ఇంకా పలుసంఘాలున్నాయని పేర్కొంది. ఉద్యోగుల్లో సగానికిపైగా ఉన్న ఉపాధ్యాయులు వివిధ సంఘాల్లో ఉన్నారని వివరించింది. ఉపాధ్యాయ,ఉద్యోగ సంఘాలతో సమగ్రంగా చర్చించకుండా నగదురహిత వైద్యం చందాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటానికి వీల్లేదని డిమా ండ్ చేసింది. ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే తీవ్రంగా వ్యతిరేకిస్తామని యూఎ స్పీసీ స్పష్టం చేసింది. ఉద్యోగుల నగదురహిత వైద్యం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరింది.