Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హెల్త్ కేర్ త్రీడీ ప్రింటింగ్ రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు. టీ హబ్లో 3డీ ప్రింటింగ్ ప్రత్యేక ల్యాబ్ను ఇప్పటికే ఏర్పాటు చేశామని తెలిపారు. టీ వర్క్స్ ద్వారా అనేక ప్రోటో టైప్స్ రూపొందిస్తున్నామన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో మెడికల్ డివైజెస్, ఇంప్లాంట్స్లో త్రీడీ ప్రింటింగ్పై జరిగిన జాతీయ సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో వివిధ సంస్థలు కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నవ్య సాంకేతికతలో తెలంగాణను అగ్రగామిగా నిలిపే లక్ష్యంలో భాగంగా 3డీ ప్రింటింగ్పై దృష్టి సారించామన్నారు. త్రీడీ ప్రింటింగ్ ద్వారా సర్జన్లు, రోగులకు వైద్య సేవలను మరింత మెరుగుపరిచే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. ఆర్థికంగా హెల్త్ కేర్ త్రీడీ ప్రింటింగ్ మార్కెట్ విలువ 2020లో 1.7 బిలియన్ డాలర్లుగా ఉందని తెలిపారు. 2027 నాటికి ఇది 7.1 బిలియన్లకు చేరుతుందని అంచనా వేశారు. ఆర్థోపెడిక్, డెంటల్తో పాటు పలు విభాగాల రోగుల్లో ఇంప్లాంట్లకు డిమాండ్ పెరగడం ఈ రంగం అభివృద్ధికి ప్రధాన కారణమని వివరించారు. ప్రస్తుతం ఈ రంగంలో అగ్రగామిగా ఎదిగేందుకు భారత్కు చక్కటి అవకాశముందని ఉందని చెప్పారు. యూఎస్, యూరోపియన్ మార్కెట్లలో ఇప్పటికే ఈ సాంకేతికత దూసుకుపోతున్నదన్నారు. ఉస్మానియాలో ఏర్పాటు కాబోతున్న నేషనల్ సెంటర్ ఫర్ అడిట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్తో ఈ రంగంలో దేశం పురోగతి సాధిస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.