Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయవాది ద్వారా బండికి నోటీసులు జారీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. తన న్యాయవాదితో బండి సంజయ్ కి కేటీఆర్ నోటీసులు పంపారు. ఈనెల 11న ట్విట్టర్లో కేటీఆర్పై బండి సంజయ్ నిరాధార ఆరోపణలు చేశారని అందులో పేర్కొన్నారు. ఆధారాలుంటే బయటపెట్టాలనీ, లేకుంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లో కేటీఆర్కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని న్యాయవాది నోటీసుల్లో పేర్కొన్నారు. ఒక జాతీయ స్థాయి పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ ప్రజా జీవితంలోని కనీస ప్రమాణాలు పాటించకుండా... కేవలం ప్రచారం పొందాలన్న యావతో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని తన క్లైంట్ కేటీఆర్కి ఆపాదించేందుకు దురుద్దేశ పూర్వకంగా ప్రయత్నించారని అందులో పొందుపర్చారు. కేటీఆర్ పరువుకు భంగం కలిగించేలా, అసత్య పూరిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం పరిహారం చెల్లించడంతో పాటు చట్టప్రకారం తగిన చర్యలకు అర్హులవుతారని పేర్కొన్నారు. బేషరతుగా 48 గంటల్లోగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.