Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎరువుల ధరలు పెంచి భారం మోపితిరి
- బ్యాంకులను దోచిన వారిని గాలికొదిలేస్తిరి...
- వ్యవసాయానికి రుణ మాఫీ చేయకపోతిరి
- మీ మాటలు కోటలు దాటుతాయి.. చేతలు గడప దాటవు
- బీజేపీ కుతంత్రం ఇక్కడ పని చేయదు
- కేంద్ర హోంమంత్రి అమిత్షాకు రేవంత్ బహిరంగ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు (2022 నాటికి) చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ హామీ ఒట్టి బూటకమని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి పేర్కొన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మూడోసారి తెలంగాణకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు రేవంత్ తొమ్మిది ప్రశ్నలను సంధించారు. 'మాటలు కోటలు దాటుతున్నాయి... చేతలు గడప దాడటం లేదు' అని ఎద్దేవా చేశారు. ఎరువుల సబ్సిడీలు ఎత్తివేసిన కేంద్రం... రైతుల నెత్తిన బరువు మోపిందని ఆక్షేపించారు. వేల కోట్ల రూపాయలతో బ్యాంకులను ముంచిన బడాబాబులు దేశాన్ని వదిలి స్వేచ్ఛగా ఎగిరిపోతుంటే, రైతుల రుణాలను మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్ల విషయంలో టీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకుని పెద్ద రాజకీయ డ్రామా ఆడాయనీ, దాని కారణంగా గడిచిన వానాకాలం నుంచి తెలంగాణ రైతులు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. పదుల సంఖ్యలో రైతులు వడ్ల కుప్పలపై గుండె పగిలి చనిపోయారనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మరణాలకు బాధ్యులు మీ రెండు పార్టీలు కాదా? అని ప్రశ్నించారు.
- గత పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలో ప్రధాన మంత్రి మోడీ తెలంగాణ విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉద్యమాన్ని కించపరిచేలా ఆయన మాట్లాడారు... ఇప్పుడు.. ఏ మొహం పెట్టుకుని వచ్చారని ప్రశ్నించారు. ఇప్పుడు తెలంగాణకు వచ్చిన సందర్భంగా మీరు ఆ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చి, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మా ప్రజలకు ఆత్మగౌరవం, ఆత్మాభిమానం లేదని మీరు భావిస్తున్నారా? అని నిలదీశారు.
- గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు కాళేశ్వరం అని పేరు మార్చి... రీ డిజైనింగ్ పేరుతో సీఎం కేసీఆర్ కమీషన్లు దండుకున్నారనీ, ఎనిమిదేండ్లుగా కేసీఆర్ కుటుంబ అవినీతిని ఉపేక్షించడం వెనుక రహస్యం ఏమిటో చెబుతారా? అని ప్రశ్నించారు.
- నిజామాబాద్ జిల్లాలో పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని లోక్సభ ఎన్నికల ప్రచార సందర్భంగా మీ పార్టీ నేత రాజ్నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. దారిలో మీ పార్టీ అభ్యరి ధర్మపురి అర్వింద్ బాండ్ పేపర్ మీద రాసిచ్చారని గుర్తు చేశారు. వీరిద్దరి మాటలు విశ్వసించిన నిజామాబాద్ ప్రజలు ఆయనను ఎంపీగా గెలిపించారు. మూడేండ్లు అవుతున్నా పసుపుబోర్డు ఊసే లేదు. దీనికి మీరు సమాధానం చెప్పాలని పేర్కొన్నారు.
- తెలంగాణ యువతకు ఉపాధి కల్పించే ఐటీఐఆర్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ లాంటి పథకాలకు గత యూపీఏ ప్రభుత్వం విభజన చట్ట ప్రకారం హామీ ఇచ్చింది. మీరు అధికారంలోకి వచ్చాక వాటిని ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. విభజన చట్టం హామీ ఇచ్చిన గిరిజన యూనివర్సిటీకి మోక్షం ఎప్పుడో చెప్పాలని డిమాండ్ చేశారు.
- అయోధ్య నుంచి రామేశ్వరం వరకు ఉన్న రాముడి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే విధంగా ''రామాయణం సర్క్యూట్'' పేరిట శ్రీ రామాయణ్ యాత్ర ఎక్స్ప్రెస్ రైలును ప్రవేశ పెట్టారు. 7,500 కి.మీ. సాగే ఈ సర్క్యూట్లో భద్రాద్రి రాముడికి చోటు దక్కపోవడానికి కారణమేంటని అడిగారు. అయోధ్య రాముడు, భద్రాద్రి రాముడు మీ దృష్టిలో ఒక్కరు కాదా?అని ప్రశ్నించారు.
- ఒడిశాలోని నైనీ కోల్ మైన్స్ టెండర్ విషయంలో జరిగిన అవినీతిపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి తాను స్వయంగా కేంద్ర బొగ్గుశాఖ మంత్రి, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాననీ, ఈ కుంభకోణం వెనుక కేసీఆర్ కుటుంబ పాత్రపై వివరాలు సమర్పించామని తెలిపాయి. ఇంతవరకూ దీనిపై చర్యలు తీసుకోకపోవడానికి కారణమేంటని అమిత్షాను ప్రశ్నించారు.
- పొరుగున ఉన్న కర్నాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన మీరు... తెలంగాణలో రెండు ప్రధాన ప్రాజెక్టుల్లో ఒక్క దానికి కూడా జాతీయహోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మీ దుర్మార్గ చట్టాలకు టీఆర్ఎస్ మద్దతు.. వారి అక్రమాలు అవినీతికి మీ మద్దతు.. ఇదే కాదా ఎనిమిదేండ్లుగా మీరు చేస్తున్నది? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- '2014లో కాంగ్రెస్ అధికారం నుంచి దిగిపోయే నాటికి పెట్రోల్ ధర రూ 71.41 పైసలు, డీజిల్ ధర రూ.55.49 పైసలు, గ్యాస్ సిలిండర్ ధర రూ.470 ఉన్నది. నేడు పెట్రోల్ లీటర్ ధర రూ.119.66 పైసలు, లీటర్ డీజిల్ ధర రూ.105.65 పైసలు, గ్యాస్ సిలిండర్ ధర రూ.1,052కి ఎగబాకింది. ఇంతలా జనాలను పన్నులు, సెస్సులతో చావగొట్టే మిమ్మల్ని మా తెలంగాణ ప్రజలు ఎందుకు క్షమించాలి?' అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి ఏ మొహం పెట్టుకొని వస్తారని రేవంత్ ప్రశ్నించారు. ప్రజల మనోభావాలతో ఆడుకునే ప్రయత్నం చేయాలనుకునే మీ కుతంత్రం తెలంగాణలో పని చేయదని హెచ్చరించారు.