Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జాతీయ స్థాయిలో పలు రాజకీయ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం ఆయన దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాజకీయ, అర్థిక, మీడియా రంగాలకుచెందిన ప్రముఖులతో సమావేశం కానున్నారు. దేశంకోసం వీర మరణం పొందిన సైనిక కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేయనున్నారు. వ్యవసాయం, రైతుల హక్కుల కోసం పోరాడి కేంద్రాన్ని నిగ్గదీసి సంచలనం సృష్టించి, జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలను కేసీఆర్ పరామర్శించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం రాత్రి పొద్దుపోయాక ఒక ప్రకటన విడుదల చేసింది.
పర్యటన వివరాలు
శుక్రవారం మధ్యాహ్నం సీఎం ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. అక్కడ వివిధ రాజకీయ పార్టీల నేతలతో ఆయన సమావేశం కానున్నారు. ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశమవుతారు. దేశ ఆర్థిక పరిస్థితులపై వారితో చర్చిస్తారు. ప్రముఖ జాతీయ మీడియా సంస్థల జర్నలిస్టు ప్రముఖులతో కేసీఆర్ సమావేశాలు నిర్వహిస్తారు. ఈనెల 22న మధ్యాహ్నం.... సీఎం ఢిల్లీ నుంచి చంఢఘీర్ బయల్దేరి వెళతారు. గతంలో ప్రకటించిన విధంగా జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 రైతు కుటుంబాలను ఆయన పరామర్శిస్తారు. వారికి ఆర్థికంగా భరోసానందించేందుకు వీలుగా ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని... ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్సింగ్తో కలిసి చేపడతారు. పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన రైతుల కుటుంబాలకు చెక్కులను అందచేస్తారు. ఈనెల 26న కేసీఆర్ బెంగళూరు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మాజీ భారత ప్రధాని దేవగౌడ, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో సమావేశమవుతారు. బెంగుళూరు నుంచి 27న రాలేగావ్ సిద్ధి పర్యటనకు వెళతారు. అక్కడ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో కేసీఆర్ భేటీ అవుతారు. అక్కడి నుంచి సాయిబాబా దర్శనం కోసం ఆయన షిర్డీ బయల్దేరి వెళతారు. అక్కడనుంచి పర్యటనలను ముగించుకుని తిరిగి హైద్రాబాద్కు చేరుకుంటారు. ఈనెల 29 లేదా 30న బెంగాల్, బీహార్ రాష్ట్రాల పర్యటనకు సీఎం సంసిద్ధమవుతారు. గాల్వాన్ లోయలో వీరమరణం పొందిన భారత సైనిక కుటుంబాలను పరామర్శిస్తారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా వారి కుటుంబాలకు ఆయన ఆర్థిక సాయం అందిస్తారు.