Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జీవ వ్యర్ధాల వల్ల జరిగే అనర్థాల నుంచి ప్రజలను, ఇతర జీవరాసులను రక్షించేందుకు నిబంధనలు కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం అరణ్య భవన్లో జల, వాయు, శబ్ద కాలుష్య నియంత్రణ- నివారణ, బయో మెడికల్ వేస్టెజ్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదం, ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ, నదీ జలాల కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై మంత్రి కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని రకాల కాలుష్య కారకాలు, నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను ఆ మండలి సభ్య కార్యదర్శి నీతూకుమారి ప్రసాద్ మంత్రికి వివరించారు. రాష్ట్రంలో 11 కామన్ బయోమెడికల్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ కేంద్రాల్లో జీవ వైద్య (బయో మెడికల్) వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వీర్యం చేస్తున్నామని వెల్లడించారు. దేశంలోనే తొలి సారిగా రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు బయోవ్యర్థాలను తరలించే వాహనాలను జీపీఎస్తో అనుసంధానం చేసినట్టు తెలిపారు. దీనిపై మంత్రి స్పందిస్తూ బయో మెడికల్ వేస్టేజ్ నిర్వహణలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలను పాటించని ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యాన్ని నియంత్రించాలని ఆదేశించారు. పరిశ్రమల నుంచి వ్యర్థ జలాల శుద్ధి కోసం ఏర్పాటు చేసిన ప్లాంట్ల నిర్వహణ, పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త కాల్చివేయడం, పంట వ్యర్ధాలను తగులబెట్టడం లాంటివి కొంత వరకు తగ్గాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జూలై 2022 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేదం అమలు కానున్నదని వెల్లడించారు. నగరాలు, పట్ణణాల్లో కాలుష్యం, చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు మున్సిపల్, ఇతర శాఖల అధికారులతో కలిసి సంయుక్తంగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న మురుగునీటి శుద్ధి ప్లాంట్ల (ఎస్టిపి)లో ఘన, ద్రవరూప వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధి చేయాలనీ, కొత్తగా మరికొన్ని ఎస్టిపిలను ఏర్పాటు చేయాల్సి ఉందనీ, దానికి అనుగుణంగా డీపీఆర్ తయారు చేయాలన్నారు.