Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు దశాబ్దాలుగా అవి అమలుకు నోచుకోలేదు
- వాటితోనే ప్రగతి సాధ్యం
- మూసవిధానాలతో దేశం ముందుకుపోదు
- కరోనా సమయంలో మన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటాం
- ఆత్మనిర్భర్ భారత్లో విద్యార్థుల భాగస్వామ్యం అవసరం
- చిన్న వ్యాపారాల వృద్ధిపై దృష్టిసారించాలి
- నాయకత్వం వహించే స్థాయికి ఎదగాలి
- ఐఎస్బీ దేశానికే గర్వకారణం
- ద్విదశాబ్ధి వార్షికోత్సవంలో ప్రధాని మోడీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'మూస విధానాలతో దేశం ముందుకుపోదు. దేశంలో సంస్కరణల అవసరం ఎప్పుడూ ఉంటుంది. రాజకీయ కారణాలతో సంస్కరణల అమలు కష్టంగా మారింది. మూడు దశాబ్దాలుగా రాజకీయ అస్థిరతతో సంస్కరణలను అమలు చేయడం కష్టమైంది. 2014 తర్వాత భారత్లో సంస్కరణల అమలు వేగవంతమైంది. దీనికి రాజకీయ సంకల్పం ఎంతో అవసరం. అప్పుడే దేశం ప్రగతిపథంలో ముందుకుపోతుంది.'అని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అన్నారు. గురువారం హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ద్విదశాబ్ది వార్షికోత్సవంలో మోడీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అక్కడ మొక్కను నాటారు. అనంతరం ఐఎస్బీ చరిత్రను తెలుసు కున్నారు. ఐఎస్బీ 20వ వార్షికోత్సవ చిహ్నాన్ని, పోస్టల్ స్టాంప్ను ఆయన ఆవిష్కరించారు. ఉత్తమ ప్రతిభ కనబరి చిన ఐఎస్బీ స్కాలర్లకు ఎక్స్లెన్స్, లీడర్షిప్ అవార్డులను ప్రదానం చేశారు. అభిజిత్, చారు భరద్వాజ్, వైదేహీ, విక్రమ్సింగ్, ఉత్కర్ష్ అరోరా, బొడిగె ప్రదీప్ కుమార్ మోడీ చేతుల మీదుగా బంగారు పతకాలను అందుకున్నారు. రాఘవ్ చోప్రాకు హైదరాబాద్ క్యాంపస్ చైర్పర్సన్ అవార్డును అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి జి కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఐఎస్బీ చైర్మెన్ హరీశ్ మన్వాణి, హైదరాబాద్ డీన్ మదన్ పిల్లుట్ల, మొహాలీ ప్రాంగణ సలహారుల మండలి చైర్మెన్ రాకేశ్ భార్తి మిట్టల్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ 2001లో ఐఎస్బీని నాటి ప్రధాని వాజ్పేయి దేశానికి అంకితం చేశారని చెప్పారు. ఇప్పటి వరకు 50 వేల మంది విద్యార్థులు అక్కడ చదివి దేశ, విదేశాల్లో ప్రముఖ సంస్థల్లో ఉన్నత స్థానాల్లో, నాయకత్వ స్థానాల్లో ఉన్నారని వివరించారు. దేశ ఆర్థికరంగంలో, వ్యాపారరంగంలో ఐఎస్బీ విద్యార్థులు కీలకపాత పోషించారని చెప్పారు. ఇక్కడ చదివిన విద్యార్థులు వందల స్టార్టప్లను తయారు చేశారని అన్నారు. భారతదేశం వ్యాపార రంగానికి పెద్దపీట వేస్తోందన్నారు. వ్యక్తిగత లక్ష్యాలను దేశ లక్ష్యాలతో జోడించాలని సూచించారు. ఆసియాలోనే ప్రముఖ బిజినెస్ స్కూల్గా నిలిచిందని అన్నారు. అందుకే ఐఎస్బీ దేశానికే గర్వకారణమని చెప్పారు. 75 ఏండ్ల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశంలో ఆజాదీకా అమృత మహోత్సవం నిర్వహిస్తున్నామని అన్నారు. రాబోయే 50 ఏండ్లకు దేశం, ప్రజల భవిష్యత్తు ఎలా ఉండాలో రోడ్మ్యాప్ రూపొందించామని వివరించారు. నవభారత్ను నిర్మిస్తామనీ, అందులో విద్యార్థులు, యువకుల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు. దేశానికి నాయకత్వం వహించేలా నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
రికార్డుస్థాయిలో ఎఫ్డీఐలు
గతేడాది రికార్డు స్థాయిలో భారత్కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) వచ్చాయని మోడీ చెప్పారు. భారత్ వ్యాపార రంగానికి పెద్దపీట వేస్తున్నామని అన్నారు. జీ-20 దేశాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ ఉందన్నారు. స్మార్ట్ఫోన్ డేటా వినియోగదారుల జాబితాలో దేశం అగ్రస్థానంలో ఉందని వివరించారు. ఇంటర్నెట్ వినియోగదారుల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉందని చెప్పారు. స్టార్టప్ల రూపకల్పన, వినియో గదారుల మార్కెట్లో భారత్ మూడో స్థానంలో కొనసా గుతున్నదని అన్నారు. పన్ను కోసం జీఎస్టీ తెచ్చామని వివరించారు. పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లను ప్రోత్సహిస్తు న్నామని చెప్పారు. సంస్కరణల్లో భాగంగా నూతన విద్యా విధానం (ఎన్ఈపీ)-2020 తెచ్చామన్నారు. కరోనా విపత్తు సమయంలో భారత్ సామర్థ్యం ప్రపంచానికి తెలిసిందని వివరించారు. సొంతంగా టీకాను అభివృద్ధి చేశామన్నారు. వంద కోట్లకుపైగా ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చామని చెప్పారు. వైద్యవిద్యలో ఎంతో అభివృద్ధి సాధించామని అన్నారు. ఎనిమిదేండ్ల క్రితం 380 మెడికల్ కాలేజీలుంటే ప్రస్తుతం ఆ సంఖ్య 600కుపైగా పెరిగిందని వివరించారు. దీంతో మెడికల్ సీట్లు సైతం పెరిగాయన్నారు. సంస్కరణల అమలుకు అధికార యంత్రాంగం సహకరిస్తోందని అన్నారు. కోవిడ్ కారణంగా గొలుసు సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నదని అన్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ భారత్ పురోభివృద్ధి సాధిస్తున్నదని చెప్పారు. వాణిజ్య అవకాశాలను అందిపుచ్చు కోవాలని ప్రపంచ దేశాలు చూస్తున్నాయని అన్నారు. ఈ ఘనతలన్నీ ప్రభుత్వ ప్రయత్నాల వల్ల మాత్రమే సాధ్యం కాలేదన్నారు. భారత్ సాధించిన ఘనతలో ఐఎస్బీ విద్యార్థులు, యువకుల పాత్ర ఎంతో ఉందని చెప్పారు.
బ్యాంకింగ్ వ్యవస్థలో మార్పులు తెచ్చాం
సంస్కరణల అమల్లో భాగంగా బ్యాంకింగ్ వ్యవస్థలో అనేక మార్పులు తెచ్చామని మోడీ అన్నారు. గతంలో బ్యాంకుల వద్ద వినియోగదారులు వరుస క్రమంలో నిలబడే వారని చెప్పారు. ఇప్పుడు ఇంటివద్ద నుంచే లావాదేవీలు జరపొచ్చని అన్నారు. దేశంలో 40 శాతం ప్రజలు డిజిటల్ లావాదేవీలు జరుపుతున్నారని వివరించారు. క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసం పెంపొదించామనీ, దీంతో వారు గొప్పగా ప్రదర్శించి పతకాలు సాధిస్తున్నారని చెప్పారు. ఖేలో ఇండియా వంటి పథకాలను అమలు చేశామని వివరించారు. దేశంలో వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి చేశామన్నారు. వాటిని అధ్యయనం చేయాలని విద్యార్థులకు సూచించారు. దేశంలో వ్యాపార రంగంలో అనేక మార్పులొస్తున్నాయని చెప్పారు. సంఘటిత, అసంఘటిత, చిన్న, మధ్యతరహా, పెద్ద వ్యాపారాలు వాటి పరిధులను విస్తరించుకొంటున్నాయని అన్నారు. వాటి ద్వారా లక్షలు, కోట్ల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. చిన్న వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరముందన్నారు. అందుకే చిన్న వ్యాపారాలపై దృష్టిసారించాలని కోరారు. దేశాన్ని రాబోయే కాలానికి అనుగుణంగా తీర్చిదిద్దాలనీ, ఆత్మనిర్భర్ భారత్గా నిర్మించాలని సూచించారు. ఐఎస్బీ విద్యార్థులు ఆర్థికరంగంలో, వ్యాపార రంగంలో, దేశాభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.