Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇఎంపీఇ డయాగ్నోస్టిక్స్ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'క్షయవ్యాధి డయాగస్టిక్ కిట్ల తయారీ కేంద్రం-గ్లోబల్ ప్రొడక్షన్ ఫెసిలిటీ'ని హైదారాబాద్లో ఏర్పాటు చేయనున్నట్టు ఇఎంపీఇ డయాగ్నోస్టిక్స్ ప్రకటించింది. రూ.25 కోట్ల పెట్టుబడితో జీనోమ్ వ్యాలీలో ప్రారంభించే కేంద్రంలో నెలకు 20 లక్షల టీబీ నిర్ధారణ కిట్లను తయారుచేస్తామని ఆ కంపెనీ ప్రకటించింది. ఇందుకోసం ఐదు దేశాల్లో క్లినికల్ పరీక్షలు నిర్వహించి తరువాత హైదరాబాద్ను ఎంచుకున్నట్టు తెలిపింది. హైదరాబాద్లో తయారయ్యే కిట్లను ప్రపంచ వ్యాప్తంగా విక్రయించనున్నారు. అదనంగా రూ.50 కోట్ల పెట్టుబడితో 150 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలను సదరు కంపెనీ కల్పించబోతుంది. మొత్తంగా రాబోయే కాలంలో హైదరాబాద్ కేంద్రంపై 25 మిలియన్ల యూరోలను పెట్టుబడిగా పెట్టే ఆలోచనలో ఉన్నామని కంపెనీ ప్రకటించింది. దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో మంత్రి కేటీఆర్తో ఇఎంపీఇ డయాగ్నోస్టిక్స్ వ్యవస్థాపకులు, సిఇవో డాక్టర్ పవన్ అసలాపురం సమావేశం అనంతరం కంపెనీ తన నిర్ణయాన్ని వెల్లడించింది.
క్షయ ప్రభావిత దేశాల్లో ఇండియా ఒకటి..
క్షయ ప్రభావిత 30 దేశాల్లో భారతదేశం ఒకటని పవన్ ఈ సందర్భంగా తెలిపారు. కోవిడ్ ప్రభావంతో టీబీ చికిత్స, నివారణ పురోగతిలో ప్రపంచం పదేండ్లు వెనక్కి వెళ్లిందని చెప్పారు. యూరప్ దేశాల్లో అయితే చికిత్సకు లొంగని విధంగా టీబీ వ్యాధి పరిణామం చెందుతున్నదని వివరించారు. ఇప్పటికీ చాలా మంది వ్యాధి చికిత్సకు అవసరమైన యాంటీ బయాటిక్లను కాకుండా తప్పుడు ఔషధాలను తీసుకుంటున్నారని చెప్పారు. ఫలితంగా టీబీ వ్యాప్తి క్రమంగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ వ్యాధిని గుర్తించి, సరైన యాంటీబయాటిక్స్తో చికిత్స చేయడం చాలా ముఖ్యమైందని అభిప్రాయపడ్డారు. కిట్ల తయారీ కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటుచేసేందుకు అవసరమైన సహాయ, సహకారాలందించిన రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ , రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
టీబీపై యుద్ధానికి సహకరిస్తాం....కేటీఆర్
ఇఎంపీఇ డయాగస్టిక్స్ టీబీపై చేస్తున్న యుద్ధానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక భారాన్ని కలిగిస్తూ ముప్పుగా పరిణమించిన ఈ వ్యాధిపై పోరాటంలో ఇఎంపీఇ ముందు వరసలో నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, రాష్ట్ర ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి ఎం.నాగప్పన్ కూడా పాల్గొన్నారు.