Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వడదెబ్బతో ఇద్దరు మహిళా కూలీలు మృతి
నవతెలంగాణ - ఎల్లారెడ్డిపేట/ గోదావరిఖని
ఉపాధి హామీ పనులు చేస్తుండగా ఇద్దరు మహిళా కూలీలు వడదెబ్బకు గురై మృతి చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకరు, పెద్దపల్లి జిల్లాలో మరొకరు చనిపోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన పడిగే లత ఉపాధి హామీలో భాగంగా శుక్రవారం గ్రామ శివారులోని ఐకెపీ గోదాముల వద్ద చెట్ల చుట్టూ కందకం పనులకు వెళ్లింది. పని చేసే సమయంలో అకస్మాత్తుగా కిందపడిపోయింది. వెంటనే ఆమెను తోటి కూలీలు సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆమె అప్పటికే మృతిచెందిందని డాక్టర్లు చెప్పారు. లతకు భర్త, ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. సంఘటన స్థలానికి ఉపాధి హామీ టీఏ ప్రభాకర్ వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఎంపీడీవో చిరంజీవి మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పరంగా జాతీయ ఉపాధి హామీ చట్టం కింద త్వరలో రూ.50వేల సహాయాన్ని అందజేస్తామని చెప్పారు.పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలో ముర్మూర్ గ్రామంలో ఉపాధి హామీ పనులకు వెళ్లిన నువ్వుల గట్టమ్మ(52) కొన్ని రోజులుగా ఉపాధి హామీ పనులకు వెళ్తుంది. గ్రామ శివారులో పని చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కూలీలు ఆమెను పక్కకు తీసుకెళ్తుండగానే వాంతులు చేసుకుని ప్రాణం కోల్పోయింది. విషయం తెలుసుకున్న జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు శ్రీధర్, ఎంపీఓ సమ్మిరెడ్డి, ఏపీఓ రమేష్ అక్కడి చేరుకొని పరిశీలించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అంతర్గాం పోలీస్లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గట్టమ్మ కుమారుడు నువ్వుల నరేష్ ఇచ్చిన ఫిర్యాదుతో ఏఎస్ఐ సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆమె మృతదేహాన్ని కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ ఇన్చార్జి మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ పరిశీలించారు.