Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్కు మించి సర్కారు బడుల అభివృద్ధి : సబిత
- కార్పొరేట్కు మించి సౌకర్యాలు మెరుగు
- సరికొత్త హంగులతో పాఠశాలలు కళకళ
- మోడల్గా డిజిటల్ తరగతి గదుల నిర్మాణం
- అందరూ అబ్బురపడేలా మౌలిక వసతులు
- 'మన ఊరు-మనబడి'తో మారిన రూపురేఖలు
- నాలుగు స్కూళ్లలో పనులు వేగవంతం
- ఆలియా పాఠశాలను సందర్శించిన మంత్రులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఈ ఫొటోల్లో కనిపిస్తున్నది కార్పొరేట్ పాఠశాల లేదంటే ఇంటర్నేషనల్ స్కూల్లోని తరగతి గది అనుకుంటున్నారా?. డిజిటల్ హంగులతో తరగతి గది ఉందంటే కచ్చితంగా అది ప్రభుత్వ పాఠశాల మాత్రం కాదు అని అనుకుంటున్నారా? కానీ అది వాస్తవం కాదు. ఇది ప్రభుత్వ పాఠశాలలోని తరగతి గదే. అయినా నమ్మలేకపోతున్నారా?. అవును ఇది నిజం. హైదరాబాద్లోని ఆలియా సర్కారు బడిలో మోడల్గా తీర్చిదిద్దిన డిజిటల్ తరగతుల నిర్మాణం ఇది. ఇప్పటి వరకు ఒక లెక్క ఇకనుంచి ఇంకో లెక్క అన్నట్టుగా సర్కారు బడులు తయారవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'మన ఊరు-మనబడి' కార్యక్రమంతో రాష్ట్రంలో సర్కారు బడుల రూపురేఖలు మారుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఆలియా పాఠశాలలో తరగతి గదులు, మౌలిక వసతులను చూస్తే ఎవరైనా 'భళా సర్కారు బడి'అని అనాల్సిందే. అందరూ అబ్బురపడేలా వసతులు మెరుగుపడుతున్నాయి. కార్పొరేట్ విద్యాసంస్థలకు మించి సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. సరికొత్త హంగులతో సర్కారు బడులు కళకళలాడుతున్నాయి. దీనికి ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికి సర్కారు తీసుకుంటున్న చర్యలు దోహదపడనున్నాయి. 'మన ఊరు-మనబడి' కార్యమ్రంలో పైలట్ ప్రాజెక్ట్గా రంగారెడ్డి జిల్లాలోని శివరాంపల్లి, జిల్లెలగూడాతోపాటు నగరంలోని ఆలియా, మహబూబియా (బాలికల) పాఠశాలలను ఎంపిక చేశారు. వాటిలో పనులు వేగవంతమవుతున్నాయి. వచ్చేవిద్యాసంవత్సరం (2022-23) నుంచి ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు సర్కారు పాఠశాలల్లో సమాంతరంగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు చర్యల ద్వారా సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
'మన ఊరు -మనబడి'తో 12 రకాల వసతులు
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో 'మన ఊరు-మన బడి', పట్టణ ప్రాంతాల్లో 'మన బస్తీ-మన బడి' కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మార్చి ఎనిమిదో తేదీన వనపర్తి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా మూడేండ్లలో రూ.7,289.54 కోట్లు ఖర్చు చేసి రాష్ట్రంలోని అన్ని సర్కారు బడుల్లోనూ మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. 'మన ఊరు-మన బడి' కార్యక్రమం ద్వారా రానున్న మూడేండ్లలో రాష్ట్రంలోని అన్ని సర్కారు బడుల్లోనూ మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 18,240 ప్రాథమిక, 3,164 ప్రాథమికోన్నత, 4,661 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 26,065 స్కూళ్ల అభివృద్ధికి రూ.7,289.54 కోట్లు ఖర్చు చేయనుంది. అత్యధికంగా విద్యార్థులుండే 9,123 (35 శాతం) స్కూళ్లను మొదటి దశలో ఎంపిక చేసింది. వాటిలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.3,497.62 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ కార్యక్రమం కింద 12 రకాల అంశాలను పటిష్టపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. నీటి సౌకర్యంతో కూడిన టాయిలెట్లు, విద్యుదీకరణ, తాగు నీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బందికి సరిపడా ఫర్నీచర్, పాఠశాల మొత్తం పెయింటింగ్ వేయడం, పెద్ద, చిన్న మరమ్మత్తులు, గ్రీన్ చాక్ బోర్డులు, ప్రహారీ గోడలు, కిచెన్ షెడ్లు, శిథిలమైన గదుల స్థానంలో కొత్త తరగతి గదులు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాళ్లు, డిజిటల్ విద్య అమలు వంటివి అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించింది. మౌలిక వసతుల కల్పన వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతంతోపాటు ప్రవేశాల సంఖ్య సైతం పెరిగే అవకాశం లేకపోలేదు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో 'మనఊరు-మనబడి, మనబస్తీ-మనబడి' కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. కార్పొరేట్కు మించి సర్కారు బడులను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. హోంమంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో కలిసి 'మనబస్తీ-మనబడి' కార్యక్రమంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన హైదరాబాద్లోని అలియా ప్రభుత్వ మోడల్ పాఠశాలను శుక్రవారం సందర్శించి ఆమె పనులు పరిశీలించారు. అనంతరం సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ముందుగా రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు విద్యా, వైద్యంపై దృష్టి సారించారని వివరించారు. సర్కారు బడుల్లో అన్ని రకాల వసతులూ కల్పిస్తూ విద్యార్థులకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లీషు మీడియం ప్రారంభిస్తామని చెప్పారు. ఇప్పటికే టీచర్లకు శిక్షణ ఇచ్చా మన్నారు. పుస్తకాల ముద్రణ పూర్తయిందని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల భోదన లేనందున విద్యార్థులను తల్లిదండ్రులు ప్రయివేటు స్కూళ్లకు పంపుతున్నారని అన్నారు. ఈ నిర్ణయాలతో సర్కారు బడుల్లో ఎక్కువ మంది విద్యార్థులు చేరుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య సంచాలకులు శ్రీదేవసేన, ఇంటర్ బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్, విద్యా మౌలిక సదుపాయాల సంస్థ చైర్మెన్ శ్రీధర్రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ తదితరులు పాల్గొన్నారు.