Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్పాదక రంగంలో అంతర్జాతీయ స్థాయికి చేరుకోవాలి
- చెంగిచెర్ల స్లాటర్ హౌస్ను సందర్శించిన మంత్రి నిరంజన్ రెడ్డి
- గొర్రెలు, మేకల పునరుత్పత్తి కేంద్రానికి ఆమోదం
నవతెలంగాణ- బోడుప్పల్
ఉత్పాదక రంగంలో అంతర్జాతీయ స్థాయిని చేరుకోవాలని, ఉత్పాదకత పెంచుకుంటేనే ప్రపంచ మార్కెట్ను తట్టుకుని నిలబడగలుతామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. హైదరాబాద్ చెంగిచెర్లలోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ను వనపర్తి గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ప్రతినిధులు, పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి మంత్రి శనివారం సందర్శించారు. డైరెక్టర్ ఎస్.బి.బర్ బుద్దే, ప్రిన్స్పల్ సైంటిస్ట్ బస్వారెడ్డితో కలిసి మొక్కను నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చైనా లాంటి దేశాల్లో ఎకరాకు వంద క్వింటాళ్లు పండిస్తే మనం ఎకరాలో 30 క్వింటాళ్లు మాత్రమే పండించగలుగుతున్నామని చెప్పారు. మాంసం, వ్యవసాయ ఉత్పత్తులను అంతర్జాతీయ సగటుకు సమానంగా ఉత్పత్తి చేయగలిగితేనే మార్కెట్లో పోటీ పడగలుగుతామని చెప్పారు. దేశంలో 7-5 కోట్ల గొర్రెలు ఉంటే.. ఒక్క తెలంగాణలోనే 2 కోట్ల గొర్రెలు ఉన్నాయని తెలిపారు. 'ఏడాదికి దేశ సగటు తలసరి మాంసం వినియోగం 6 కేజీలు, కానీ తెలంగాణ సగటు తలసరి వినియోగం 23 కేజీలు.. అంటే మనకున్న గొర్లుగాక ప్రతిరోజూ ఇతర రాష్ట్రాలవి దిగుమతి చేసుకుంటున్నాం' అన్నారు. గొర్రెల పెంపకాన్ని ఇంకా పెంచుకుంటూ, మాంసం దిగుబడి అధికంగా వచ్చే బ్రీడ్స్ను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఇప్పుడు సగటు గొర్రె మాంసం 13 కేజీలు.. కనీసం 25 కేజీల సగటు సాధిస్తే మన భవిష్యత్ అవసరాలు తీరుతాయన్నారు. ఉత్పాదకత పెంపునకు గల అవకాశాల వివరాలను స్థానిక భాషలో ముద్రించి గొర్రెల, మేకల పెంపకందారులకు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం గొర్రెల పునరుత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ఆమోదం తెలిపిందన్నారు. పరిశోధన కేంద్రం ఏర్పాటు కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు.
కంది, జొన్న, మొక్కజొన్న, పప్పుశనగ, ఉలవ, మినుము పంటల నూర్పిడి తర్వాత మిగిలే వ్యర్థాల మిశ్రమాలు గొర్రెల మేతకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. గొర్రెల పెంపకం, మాంసం ఎగుమతుల్లో అంతర్జాతీయ ప్రమాణాలు అందుకోవాలన్నారు. దేశంలో ఏ మార్పునైనా స్వీకరించడానికి కొంత ఆలస్యం అవుతుందని, మార్పు మొదలైతే వేగంగా పెను మార్పులకు దారి తీస్తుందని అన్నారు. గొర్రెలు, మేకల పెంపకందారులు సొసైటీలుగా ఏర్పడి ఈ దిశగా మాంసం ఎగుమతులపై దృష్టిసారించాలని సూచించారు. నిజాం ముని మనవడు ఆస్ట్రేలియాలో గొర్రెల పెంపకం పని చేస్తున్నారని, అందువల్ల ఏ పనినీ ఎప్పుడూ నామోషీగా భావించకూడదని చెప్పారు. వనపర్తిలో అత్యాధునిక స్లాటర్ హౌజ్, మాంసం ప్రాసెసింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకుందామన్నారు. ఉమ్మడి పాలమూరు, ఉమ్మడి పాలమూరులో వనపర్తి ప్రాంతంలో ఎక్కువగా గొర్రెలు ఉన్నాయని చెప్పారు. వనపర్తి గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలోని 192 సంఘాలు మాంసం ఎగుమతుల మీద దృష్టి సారించాలన్నారు.