Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్కారువన్నీ ఉత్తుత్తి మాటలే..
- సంఘటిత ఉద్యమాలకు సన్నద్ధం నవతెలంగాణ ఇంటర్యూలో వ్యకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకటరాములు
'స్వరాష్ట్రం వస్తే తమ బతుకులు మారతాయని వ్యవసాయ కార్మికులు ఆశించిండ్రు. ఉపాధి అవకాశాలు మెరుగైతయని ఆశపడ్డరు. కూలి, పనిదినాలు పెరుగుతయంటే..నిజమేనని నమ్మిండ్రు. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు అయింది. కొత్త సీసాలో పాత సార లాగా పాలన కొనసాగుతున్నది తప్పితే..వ్యవసాయ కార్మికులకు ఒరిగిందేమీ లేదు. నిరుపేదలకు భూ పంపిణీ పథకం అటకెక్కింది. ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో సుమారు 20లక్షల మంది పేదలున్నారని తేలింది. ఇందులో వ్యవసాయ కార్మికులే ఎక్కువ. వీరిని ఆర్థికంగా, సామాజికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం దగ్గర సరైన ప్రణాళిక లేదు. మాటలు కోటలు దాటుతున్నాయి...చేతలు మాత్రం గడప దాటడం లేదన్నట్టు సర్కారు మాటలు పేదల కడుపు నింపక పోగా ప్రభుత్వ విధానాల ఫలితంగా మరింత దిగజారాయి. ఎనిమిదేండ్ల కాలంలో నిజవేతనాలు పడిపోయాయి. కొనుగోలు శక్తి తగ్గింది. పౌష్టికాహార లోపంతో ఆసుపత్రుల పాలవుతున్నారు. పనిదినాలు తగ్గిపోవటంతో చేతుల పైసల్లేక అప్పుల పాలవుతున్నారు. ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఈ విషయాలను ప్రభుత్వం గుర్తించటం లేదు. ఈ నేపథ్యంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పేదలను ఐక్యం చేసి సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించేం దుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం' అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు నవతెలంగాణకు తెలిపారు. జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ఆయన నవతెలంగాణకు ప్రత్యేక ఇంటర్యూ ఇచ్చారు. అందులోని ముఖ్యంశాలు..
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత వ్యవసాయ కార్మికుల్లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పట్ల ఉన్న అభిప్రాయం?
ఏ ప్రభుత్వంలోనైనా.. ప్రజల అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వానికి ఉంటుంది. కానీ.. అధికారంలోకి వచ్చినాక పూర్తిగా ప్రజల ఆకాంక్షలను మర్చిపోవటం పాలకులకు రివాజుగా మారుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే.. భూమిలేని పేదలకు భూములొస్తయని భావించిండ్రు. కూలి రేట్లు పెరుగుతయని ఆశపడ్డరు. పనిదినాలు పెరుగుతయనుకున్నరు. నీళ్లు, నిధులు, నియామకాలంటే..అందులో మా వాటా మాకుంటదని సంబరపడ్డరు. కానీ..రాష్ట్రం ఏర్పడి, టీఆర్ఎస్ అధికారంలోకొచ్చి ఎనిమిదేండ్లు కావస్తున్నది. పేదల బతుకులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. వారి ఆకాంక్షలు, ఆశలు తీరకపోవటంతో వ్యవసాయ కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వ్యవసాయ కార్మికుల జీవన విధానంలో వచ్చిన మార్పు లేంటి? వాగ్దానాల అమలు తీరేలా ఉంది?
రాష్ట్రం ఏర్పడ్డంత మాత్రాన పాలకుల విధానాలు మారవు కదా..కొత్త కొత్త వాగ్దానాలు.. మాటల గారడీలు తప్ప ఆచరణలో పేదల బతుకుల్లో పెద్దగా తేడా లేదు. రాష్ట్రంలో సుమారు 20లక్షల మంది పేదలున్నారు. వీరిలో వ్యవసాయ కార్మికులే ఎక్కువ. రోజు వారి కూలి చేస్తేనే నోట్లోకి ముద్దదిగేది. రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించినట్టు చెబుతున్నారు. వాస్తవంగా పనిదినాలు పడిపోయి, పనికి తగ్గ వేతనం రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలు లక్షలాదిగా ఉన్నారు. ఇంటి స్థలం ఉంటే.. ఆ స్థలంలో రూ. 5లక్షలతో డబుల్ బెడ్రూం కట్టిస్తానని గతంలో కేసీఆర్ ప్రకటించారు. ఇప్పుడేమో మూడు లక్షలే ఇస్తామని మాట మార్చారు. అవి కూడా ఎక్కడా కట్టించినదాఖలాలు లేవు. భూమి లేని పేదలకు మూడెకరాలు భూమి ఇస్తామని గోల్కొండ కోట నుంచి ప్రకటించారు. ఆ వాగ్దానం నీటిమీది బుడగలా మారింది. వాస్తవంగా రాష్ట్రంలో పేదలకు భూములు పంచేందుకు అవసరమైన రకరకాల ప్రభుత్వ భూములున్నరు. కాకపోతే సర్కారుకు చిత్తశుద్ధి లేదు. పేదలకు భూములు ఇవ్వటానికి లేనప్పుడు..పారిశ్రామిక అధిపతులకు వందల వేల ఎకరాలు కట్టబెడుతున్న వైనాన్ని ఇప్పుడు చూస్తున్నాం కదా.. మరి వారికివ్వటానికి ఎక్కడినుంచి వస్తున్నారు.? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇదిలా ఉంటే గత ప్రభుత్వం పేదలకిచ్చిన ఇంటి స్థలాలను, ఇతర భూములను పారిశ్రామిక అభివృద్ధి పేరుతో తిరిగి తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నది. ఇది వ్యవసాయ కార్మికులు, పేదలను వంచించటం తప్ప మరోకటి కాదు. మరో
పక్క తెలంగాణ రాష్ట్రంలో సుమారు పది లక్షల మంది పోడు రైతులున్నరు. ఎన్నో ఏండ్లనుంచి పోడు భూమిని నమ్ముకుని బతుకుతున్నరు. వారిని ఆ భూములనుంచి తరిమేసేందుకు ఈ సర్కారు కుట్ర చేసింది. ప్రజా ఉద్యమాల ఫలితంగా ప్రతి పోడు రైతుకు పట్టా ఇస్తామని కేసీఆర్ ప్రకటిం చారు. ఆచరణలో ఆ ప్రక్రియ నత్తలను మరిపించే విధంగా సాగుతున్నది.రాష్ట్రంలో 57 సంవత్సరాలు నిండిన వారికి పింఛన్లు ఇస్తానని వాగ్దానం చేసంది ప్రభుత్వం. కానీ ఇవ్వటం లేదు.కొత్త రేషన్ కార్డుల వ్యవహారం కూడా అటకెక్కింది.ప్రజా పంపిణీ వ్యవస్థపై ఆధారపడి జీవించే పేదలకు ఎదురు చూపులే మిగులుతున్నాయి. వ్యవసాయ చట్టం ప్రకారం వేతనాలను రివైజ్ చేసి, అమలు చేయాల్సిన బాధ్యత ప్రభు త్వానిదే.ఎనిమిదేండ్ల కాలంలో ఒక్క సారి మినహా.. కూలీల వేతనాల గురించి మాట్లాడిన పాపాన పోలేదు.వాటిని రివైజ్ చేయటమే కాక అమలు చేసే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రదర్శించటం లేదు. వాటిపై వీరిలో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రచారం లేదు.ఉపాధి హామీ పనిలోకూడా కనీస వేతనాలు అమలు కావటం లేదు.
వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాబోయే కాలంలో మీరు ఎలాంటి ఉద్యమాలు చేయబోతున్నారు?
రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులు తీవ్రమైన సమస్యలను ఎదుర్కుంటున్నారు. ఇండ్లు లేనివారు ఎందరో ఉన్నారు. కనీసం ఇంటి స్థలం కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలకోసం పోరాటాలకు సన్నద్ధమవుతున్నాం. భూమిలేని పేదలంద రికీ భూమి పంచాలని ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నాం.ఉపాధి హామీ చట్ట రక్షణ, కనీస వేతన చట్ట రక్షణ తక్షణ అవసరంగా భావించాం. జీవిత భధ్రత, ప్రమాద బీమా, రేషన్ కార్డులు, పింఛన్లు తదితర వ్యవసాయ కార్మికుల, పేదల సమస్యలపై వచ్చే నెల నుంచి దశలవారీ ఉద్యమాలకు పేదల్ని సన్నద్ధం చేస్తున్నాం.