Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలు, ప్రజాతంత్ర, లౌకిక వాదులు వాటిని తిప్పికొట్టాలి : జూలకంటి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కులం, మతం పేరిట రాజకీయాలు తగవని ఆయా పార్టీలకు మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి హితవు పలికారు. అలాంటి రాజకీయాలను ప్రజలు, ప్రజాతంత్ర, లౌకిక వాదులంతా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు హైదరాబాద్లో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు కలిసిమెలిసి ఉండేలా చూడాల్సిన రాజకీయ పార్టీలే తమ స్వార్థం కోసం కుల, మత విద్వేష రాజకీయాలకు పాల్పడటం దారుణమని పేర్కొన్నారు. ప్రజాసమస్యలను పక్కదోవ పట్టిస్తూ మసీదు, మందిరం పేరుతో విభజన రాజకీయాలకు పాల్పడే పార్టీల తీరును గుర్తించి నడుచుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రజలకు తిండీ, బట్ట, మెరుగైన విద్యావైద్య సౌకర్యాలను కల్పించకుండా స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను చీల్చటం దారుణమన్నారు. కులాలు, మతాలు అన్నం పెట్టవనీ, ప్రతిఒక్కరూ మానవత్వంతో మసులుకోవాలని కోరారు. కుల, మత విద్వేషాలతో దేశం మరింత వెనుకబాటుకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.