Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రిటిష్ పాలన సాగిస్తున్న కేంద్ర ప్రభుత్వం
- కార్మికుల పక్షాన టీఆర్ఎస్ ప్రభుత్వం
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత
నవతెలంగాణ-కాజీపేట
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తూ దేశంలో బ్రిటిష్ పాలన సాగిస్తుందని, ప్రభుత్వ రంగ ఆస్తులను ప్రయివేటు వ్యక్తులకు అమ్ముకుంటూ ప్రజలపై భారం మోపడానికి సిద్ధంగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. కార్మిక మాసోత్సవంలో భాగంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినరు భాస్కర్ ఆధ్వర్యంలో ఫాతిమానగర్లోని సెయింట్ గ్యాబ్రియల్ గ్రౌండ్లో టీఆర్ఎస్కేవీ ఏర్పాటు చేసిన కార్మిక ధర్మయుద్ధం బహిరంగ సభకు ఆమె ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ సంస్థలను అదానీకి దారాదాత్తం చేస్తూ ప్రజల ఆస్తులను దోచుకుంటుందన్నారు. దేశసంపదను సృష్టిస్తున్న కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెెళ్తుందని చెప్పారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, 4 కోడ్లను తీసుకొచ్చి కార్పొరేట్, ప్రయివేటు సంస్థలను బీజేపీ ప్రోత్సహిస్తుందని, దాంతో కార్మికులకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆరోపించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించకుండా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. దేశంలో 16 లక్షల ఉద్యోగాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయన్నారు. రద్దు చేసిన కార్మిక చట్టాలను వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశం ప్రయివేటు వ్యక్తులపరమైతే పేద,మధ్యతరగతి ప్రజలుతకడం కష్టం అవుతుందన్నారు. సీఎం కేసీఆర్తో రాష్ట్రంలో అన్ని తరగతుల ప్రజలకు సమన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరు భాస్కర్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ఇవ్వడమే కాకుండా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులను రెగ్యులరైజ్ చేసిన ఘనత టీఆర్ఎస్దే అని కొనియాడారు. కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, నన్నపనేని నరేందర్, కుడా చైర్మెన్ సుందర్రాజు యాదవ్, మేయర్ గుండు సుధారాణి, వికలాంగుల సంస్థ చైర్మెన్ వాసుదేవరెడ్డి, దాస్యం విజరు భాస్కర్, ఎల్లావుల లలిత యాదవ్, కార్పొరేటర్లు, కార్మిక సంఘాల నాయకులు, డివిజన్ ల అధ్యక్షులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.