Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితకు కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్. డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ జాబితాను విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి త్వరగా పంపించేలా చర్యలు తీసుకోవాలని టీఎస్జీసీసీఎల్ఏ-475 డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని శనివారం హైదరాబాద్లోని ఆ సంఘం అధ్యక్షులు జి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ కలిసి వినతిపత్రం సమర్పించారు. కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ గురించి ఆర్థిక, ఉన్నత విద్యాశాఖల నుంచి మెమోలు వచ్చినప్పటికీ ఇంత వరకు ఇంటర్ విద్యా కమిషనరేట్ నుంచి క్రమబద్ధీకరణ జాబితా సచివాలయానికి పంపించలేదని తెలిపారు. దీంతో కాంట్రాక్ట్ లెక్చరర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న ఒకేషనల్ కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ విషయంలో కొంతమంది అధికారులు, అనధికార వ్యక్తులు పెడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. ఇంటర్ ఒకేషనల్ కోర్సుల్లో రాష్ట్ర విభజన జరిగిన సందర్భంగా వచ్చిన పోస్టులన్నీ క్రమబద్ధీకరణ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. అందుకు సంబంధిచిన ఆధారాలను మంత్రికి సమర్పించామని తెలిపారు. దీనిపై ఆమె స్పందిస్తూ ఇంటర్ విద్యా కమిషనర్తో ఫోన్లో ఈ విషయాలపై మాట్లాడారని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్లందర్నీ క్రమబద్ధీకరణ జాబితాలో చేర్చి, వారిని క్రమబద్ధీకరణ చేయాలని కోరారు. అనంతరం ఇంటర్ విద్య కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ను కలిశారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీల కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్ రాష్ట్ర నాయకులు శోభన్, నరసింహరాజు, రవీంద్రకుమార్, రాధాకృష్ణ, సంగీత, శైలజారెడ్డి, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.