Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్కారు గ్రీన్ సిగల్
- పురపాలక, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పోస్టుల భర్తీకి ఓకే
- ఉత్తర్వులు విడుదల
- ఇప్పటి వరకు 35,220 నియామకాలకు అనుమతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పురపాలక, పట్టణాభివృద్ధి.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లోని పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ రెండు శాఖల్లోని వివిధ క్యాడర్లకు సంబంధించి 1,433 పోస్టుల భర్తీకి అనుమతులనిస్తూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యక్ష నియామక ఖాళీలు 91,142 ఉండగా, ఇందులో 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులున్నారు. వారిని క్రమబద్ధీకరించగా మిగిలిన 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామంటూ శాసన సభ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గ్రూప్ వన్ పోస్టులు 503, పోలీసు, ట్రాన్స్ పోర్ట్, ఫారెస్ట్, ఎక్సైజ్, బేవరేజెస్ కార్పొరేషన్ వంటి వివిధ శాఖల్లో 33,787 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య, ఆరోగ్యశాఖలో 12,775 ఉద్యోగాలను విడతలవారీగా భర్తీ చేయాలనీ, అందులో 10,028 ఉద్యోగాలను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో తొలి విడతగా ఎంబీబీఎస్ అర్హత కలిగిన 1,326 ఉద్యోగాలకు నోటిఫికేష్ ఇవ్వాలని ఆయన సూచించారు. తాజాగా మంగళవారం మరో 1.433 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో సంబంధిత నోటిఫికేషన్లు త్వరలో విడుదల కానున్నాయి. ఇప్పటి వరకు 35,220 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఆయా శాఖాల్లో మిగిలిన ఖాళీలను భర్తీ చేసేందుకు వీలుగా ఆర్థిక శాఖ కరసత్తు చేస్తోంది.