Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిలపక్షాన్ని పిలవండి.. శాంతి భద్రతలపై చర్చిద్దాం..
- సీఎం కేసీఆర్కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
'అఖిలపక్షాన్ని పిలవండి. శాంతిభద్రతలపై చర్చిద్దాం. తెలంగాణను కాపాడుకోవడానికి ఎలాంటి శషబిషలు లేకుండా ప్రగతిభవన్కు నేనే వస్తా' అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్రెడ్డి గురువారం బహిరంగ లేఖ రాశారు. ''హైదరాబాద్లో పబ్, క్లబ్, డ్రగ్స్ వాడకం వంటి దుష్ట సంస్కృతి తీవ్ర భయాందోళనలను కలిగిస్తోంది. ముఖ్యంగా ఆడపిల్లలను బయటకు పంపాలంటేనే భయపడే దుస్థితి తల్లిదండ్రుల్లో నెలకొంది. మనం పోరాడి సాధించుకున్న తెలంగాణకు ఈ పరిస్థితి అవమానకరం కాదా? మన తెలంగాణ ప్రతిష్టను, హైదరాబాద్ ఖ్యాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా? దీనికోసం మీరు, మీ వ్యక్తిగత అహంకారాన్ని పక్కన పెట్టి అఖిలపక్షంతో, మహిళా, స్వచ్ఛంద, పౌర రక్షణ సంఘాలతో కలిసి చర్చించండి. భయాందోళనకు గురవుతున్న ప్రజలకు విశ్వాసం కల్పిద్దాం. శాంతిభద్రతలకు విఘాతం కల్పించే సంఘవిద్రోహ శక్తులను, తెర వెనుక వాటికి అండగా ఉన్న వాళ్ళు ఏ స్థాయిలో ఉన్న వారైనా కర్కశంగా తొక్కి వేయాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా మీ మీద ఉంది' అని లేఖలో పేర్కొన్నారు. 'జూబ్లీహిల్స్లో మొన్న ఒక బాలిక మీద నలుగురు యువకులు లైంగికదాడికి పాల్పడిన ఘటన మీరు సిగ్గుపడాల్సిన విషయం కాదా? ఘటన జరిగిన తర్వాత నాలుగైదు రోజులపాటు పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం మౌనంగా ఎందుకున్నాయి? సాక్ష్యాలను, ఆధారాలను మాయం చేశారని వస్తున్న వాదనకు మీరు సమాధానం చెప్పరా? ఒక ప్రభుత్వ వాహనంలో ఈ గ్యాంగ్ రేప్ జరిగితే మీకు బాధ్యత లేదా? మీరు నియమించిన వక్ఫ్ బోర్డు చైర్మెన్ కొడుకు ఉన్నా, ఎందుకు తొలగించలేదు? అంతకుముందే చిన్నారి చైత్రను చిదిమేసిన ఘటన ఎంత అమానుషం? వాటికి కారణమవుతున్న డ్రగ్స్, పబ్స్, క్లబ్స్ మీద, వాటి నిర్వాహకుల మీద ఎందుకు కఠినంగా వ్యవహరిస్తలేరు? ఇప్పటివరకు ఒక ముఖ్యమంత్రిగా ఎందుకు సమీక్ష చేయలేదు? ఇవన్నీ భయాందోళనల్లో ఉన్న తెలంగాణ ప్రజల మనోబలాన్ని దెబ్బ తీస్తాయి' అని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్, తెలంగాణలో ఇంకా శాంతి భద్రతలు దిగజారకుండా, మరొకరు బలి కాకుండా చర్యలు తీసుకోవాలనీ, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.