Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 23న హైదరాబాద్లో బహిరంగసభ
- 25 వరకు ఎంసీపీఐ(యూ) రాష్ట్ర మహాసభలు
- పోస్టర్ ఆవిష్కరణలో నాయకులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రజా ఉద్యమాల బలోపేతమే లక్ష్యంగా ఈనెల 23,24,25 తేదీల్లో ఎంసీపీఐ(యూ) రాష్ట్ర మహాసభలు గ్రేటర్ హైదరాబాద్లో జరుగుతాయని ఆహ్వాన సంఘం అధ్యక్షులు నల్లా సూర్యప్రకాశ్, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి చెప్పారు. బుధవారం హైదరాబాద్లోని ఓంకార్ భవన్లో పోస్టర్, కరపత్రాలను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సూర్యప్రకాశ్, రవి మాట్లాడుతూ ఈనెల 23న ఎంసీపీఐ(యూ) రాష్ట్ర మాజీ కార్యదర్శి తాండ్ర కుమార్ స్థూపం ఆవిష్కరణతోపాటు భారీ ప్రదర్శన నిర్వహిస్తామనీ, అనంతరం మియాపూర్ మార్కెట్ ఆవరణలో బహిరంగ సభ జరుగుతుందని వివరించారు. ముఖ్య అతిధులుగా ఎంసీపీఐ(యూ) ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్, కేరళ రాష్ట్ర కార్యదర్శి శ్రీకుమార్, పొలిట్బ్యూరో సభ్యులు కాటం నాగభూషణం, వల్లెపు ఉపేందర్రెడ్డి, అరుణోదయ విమలక్క తదితరులు పాల్గొంటారని అన్నారు. పాలకుల దోపిడీ విధానాలను నిరసిస్తూ ప్రజా సంక్షేమ పాలన కోసం లాల్నీల్ ఐక్యత కోరుతూ ప్రజా ఉద్యమాలు నిర్మించడానికి ఈ మహాసభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పాలకులు అనుసరిస్తున్న విధానాలతో ప్రజల శ్రమను సంపదను సంపన్నులు దోచుకుంటున్నారని విమర్శించారు. సమస్యలు పరిష్కరించాలని ఉద్యమిస్తే తప్పుడు కేసులు పెట్టి నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నియంత పద్ధతులను కొనసాగిస్తున్నారని అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మతోన్మాద విధానాలతో మరిన్ని కష్టాలకు గురి చేస్తున్నదని విమర్శించారు. ప్రజలకు సేవచేసే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్ పరం చేస్తున్నారనీ, కేసీఆర్ ప్రభుత్వం సైతం నిజాం పాలనను తలపిస్తున్నదని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా ఉద్యమాలను బలోపేతం చేసేందుకు వామపక్షాలు, సామాజిక ఉద్యమాలను ఐక్యం చేయడానికి ఈ మహాసభలు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సింగతి సాంబయ్య, కుంభం సుకన్య, వరికుప్పల వెంకన్న, వస్కుల మట్టయ్య, పెద్దారపు రమేష్, గోనె కుమారస్వామి, ఎన్ రెడ్డి, హంసా రెడ్డి, వి తుకారాం నాయక్, కన్నం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.