Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఇంటర్ విద్యాపరిరక్షణ సమితి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ జాబితా విషయంలో ఇంటర్ కమిషనరేట్ వైఖరికి నిరసనగా ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్) ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై అధ్యాపకులు, కాంట్రాక్టు అధ్యాపకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు టిప్స్ కన్వీనర్లు మాచర్ల రామకృష్ణగౌడ్, కొప్పిశెట్టి సురేష్, సమన్వయకర్త మైలారం జంగయ్య శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్థిక, ఉన్నత విద్యా శాఖలు కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ జాబితా కోసం మూడు నెలల క్రితమే ఇంటర్ విద్య కమిషనర్కు లేఖలు పంపాయని గుర్తు చేశారు. ఆ జాబితా ప్రభుత్వానికి పంపించడంలో జాప్యం చేస్తూ, అనేక ఇబ్బందులు సృష్టిస్తున్న ఇంటర్ కమిషనర్ వైఖరికి నిరసనగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశామని తెలిపారు. సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లకు వినతి పత్రాలు సమర్పించామని పేర్కొన్నారు. శనివారం సైతం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తామని వివరించారు. ఇప్పటికైనా ఇంటర్ విద్య కమిషనర్ కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ జాబితాను ప్రభుత్వానికి పంపించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ కాంట్రాక్ట్ అధ్యాపకుల క్రమబద్ధీకరణ విషయంలో జోక్యం చేసుకోవాలనీ, త్వరగా క్రమబద్ధీకరణ జరిగేట్టు చూడాలని కోరారు.