Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జర్నలిస్టు, రచయిత గటిక విజయ్ కుమార్కు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది. తెలుగు విశ్వ విద్యాలయం, జానపద గిరిజన విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో 'తెలంగాణ ఉద్యమంలో జానపద కళల వినియోగం - అధ్యయనం' అనే అంశంపై విజరుకుమార్ పరిశోధన చేసి, సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించారు. నిపుణుల కమిటీ ఈ గ్రంథాన్ని పరిశీలించి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ(పీహెచ్డీ) అవార్డుకు సిఫారసు చేసింది. జానపద గిరిజన విజ్ఞానపీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న పర్యవేక్షణలో ఈ పరిశోధన జరిగింది. హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో యూనివర్సిటీ ఉప కులపతి ప్రొఫెసర్ తంగెడ కిషన్రావు అవార్డుకు సంబంధించిన నోటిఫికేషన్ను విజరుకుమార్కు అందించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ భట్టురమేశ్, ఎగ్జామినేషన్ కంట్రోలర్ మురళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన విజరుకుమార్ ఏడేండ్ల పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ప్రజా సంబంధాల అధికారిగా పనిచేశారు. వివిధ దినపత్రికలు, న్యూస్ ఛానళ్లలో 20 ఏండ్లు జర్నలిస్టుగా పనిచేశారు. ఉజ్వల ప్రస్థానం, జ్వలిత దీక్ష, బంగారు బాట, బతుకమ్మ లాంటి అనేక పుస్తకాలు రచించారు.