Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 25న భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం
- తెలంగాణ ఇంటర్ విద్యాపరిరక్షణ సమితి హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణకు సంబంధించిన జాబితాను ఈనెల 23లోగా రాష్ట్ర ప్రభుత్వానికి పంపకుంటే ఉద్యమం చేపడతామని ఇంటర్ విద్యాకమిషనరేట్ను తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్) హెచ్చరించింది. కమిషనరేట్ వైఖరికి నిరసనగా నల్లబ్యాడ్జీలతో రెండోరోజు విధులకు హాజరై అధ్యాపకులు, కాంట్రాక్టు అధ్యాపకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు టిప్స్ కన్వీనర్లు మాచర్ల రామకృష్ణగౌడ్, కొప్పిశెట్టి సురేష్, సమన్వయకర్త మైలారం జంగయ్య శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 25న భాగస్వామ్య సంఘాలతో చర్చించి భవిస్యత్ ఉద్యమ కార్యాచరణపై చర్చించి ప్రకటిస్తామని తెలిపారు. ఆర్థిక, ఉన్నత విద్యా శాఖలు కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ జాబితా కోసం మూడు నెలల క్రితమే ఇంటర్ విద్య కమిషనర్కు లేఖలు పంపాయని గుర్తు చేశారు. ఆ జాబితా ప్రభుత్వానికి పంపించడంలో జాప్యం చేస్తూ, అనేక ఇబ్బందులు సృష్టిస్తున్న ఇంటర్ కమిషనర్ వైఖరికి నిరసనగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశామని తెలిపారు. సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లకు వినతి పత్రాలు సమర్పించామని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఇంటర్ విద్య కమిషనర్ కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ జాబితాను ప్రభుత్వానికి పంపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిప్స్ రాష్ట్ర నాయకులు నగేష్, శోభన్బాబు, వస్కుల శ్రీనివాస్, గంగాధర్, కరణం రాజు, పూర్ణచందర్, దేవేందర్, సాయన్న, నాగరాజు, అబ్దుల్ రషీద్, కరుణాకర్ గౌడ్, నాగరాజు, శివానంద్ తదితరులు పాల్గొన్నారు.